UP CM Yogi: ఉత్తమ పాలకుడు.. భావి మోడీ.. బీజేపీకి మాంచి రథసారధి.. దేశీయంగా పట్టు సాధిస్తాడు.. అనుకున్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాధ్ రాజకీయ కెరీర్ చిక్కుల్లో పడింది.. యూపీలో మళ్ళీ బీజేపీ అధికారంలోకి వస్తే ఆయనకు సీఎం పదవి ఉంటుందో లేదో కూడా చెప్పలేని పరిస్థితి నెలకొంది..! పాలనాపరంగా ఆయన తీసుకున్న నిర్ణయాలు మంచి పేరు తెచ్చిపెట్టాయి. కానీ అనూహ్యంగా ఆయనపై వ్యతిరేకత మొదలయింది. బీజేపీలోనే ఆయన అంటే గిట్టని వారు చాలా మంది ఉన్నారు. పార్టీ పెద్దలకు ఉత్తరాలు ద్వారా, ఫోన్లు ద్వారా తరచూ ఆయనపై ఫిర్యాదులు వెల్తూనే ఉన్నాయి. అందుకే వచ్చే ఏడాది జరగనున్న యూపీ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ గెలిచినా తర్వాతనే సీఎం అభ్యర్థిని ప్రకటిస్తామని ప్రకటించడం ద్వారా యోగీకి అవకాశాలు లేనట్టే అని పరోక్షంగా సంకేతాలిస్తున్నారు.
UP CM Yogi: మోడీతో విబేధాలు – కారణాలు ఇవే..!
యోగీకి మంచి పేరు ఉంది. పాలకుడిగా యూపీలో మంచి ముద్ర వేసుకున్నారు. ఆరెస్సెస్, బీజేపీ వర్గాల మద్దతు కూడా బాగానే కూడగట్టుకున్నారు. కానీ కొన్ని వివాదాస్పద నిర్ణయాలు.., అతి క్రమశిక్షణ పేరుతో ఎమ్మెల్యేలను సైతం విసిగించడం ఎక్కువయిందని.. పార్టీలో సహచర మంత్రి వర్గానికి కూడా స్వేచ్ఛ ఇవ్వడం లేదని.., వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటున్న సమయంలో మోడీని, అమిత్ షా వంటి బీజేపీ పెద్దల్ని సంప్రదించకుండా తీసుకుంటున్నారని ఆయనపై ఎప్పటి నుండో బీజేపీ పెద్దలకు గురి ఉంది. జీవో వచ్చిన తర్వాత వేరే వాళ్ళ ద్వారా పార్టీ పెద్దలకు తెలుస్తున్నాయి. అందుకే మోడీ ఈ విషయంలో గుర్రుగా ఉన్నారని.. యోగీ పలుమార్లు మాట్లాడాలని అపాయింట్మెంట్ కోరినా మోడీ నిరాకరించారని అనుకుంటున్నారు. ఇటీవల ఢిల్లీ వెళ్లి అమిత్ షా, మోడీని కలిసినప్పటికీ ఆయనకు అంత అనుకున్నట్టు జరగలేదని.. కేంద్ర నిఘా వర్గాలు యూపీలో ప్రత్యేక నిఘా పెట్టి, యోగీపై వారానికో నివేదికలు ఇస్తున్నాయని అంటున్నారు.
మంత్రుల నుండి ఎసరు..!?
యోగీ మంత్రి వర్గంలో కొందరితో ఆయనకు పొసగడం లేదు. కానీ కేంద్ర పెద్దల ఆశీస్సులతో మంత్రులు కొనసాగుతున్నారు. అందుకే యోగీపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈరోజు తాజాగా యూపీ మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య ఒకడుగు ముందుకేశారు. “వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల్లో బీజేపీ గెలుపు మాకు ముఖ్యం. సీఎం ఎవరనేది ఎన్నికలు ముగిశాక ప్రకటిస్తాం” అన్నారు. అంటే యోగీ సీఎం అభ్యర్థి కాదు అనే విషయాన్నీ ఆయన పరోక్షంగా సంకేతాలిచ్చారు. సీఎం ని డిసైడ్ చేయడానికి మంత్రి ఎవరు..!? అనే అనుమానం రావచ్చు. జాతీయ పార్టీల్లో అంతే… కేంద్రంలో పెద్దల ఆశీస్సులు ఎవ్వరైనా ఏమైనా మాట్లాడవచ్చు. అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సీఎం రాజశేఖర్ రెడ్డిపై డీ శ్రీనివాస్, వీహెచ్ వంటి వారు తరచూ కామెంట్లు చేసేవారు. కిరణ్ కుమార్ రెడ్డి సమయంలో కూడా వీహెచ్ కామెంట్లు చేసేవారు. జాతీయ పార్టీల్లో సీఎం ని గౌరవించకపోయినా పర్వాలేదు.. కేంద్ర పెద్దల భజనలు చేసుకుంటే చాలు..!