AP CM YS Jagan: తమిళనాడులో రాజకీయ నాయకులకు, సెలబ్రిటీలకు గుడి కట్టిన సందర్భాలు అనేకం ఉన్నాయి. తమిళనాడు ముఖ్యమంత్రిగా పని చేసిన జయలలితకు గుళ్లు గట్ట పూజలు చేసిన అభిమానులు ఉన్నారు. ప్రముఖ సినీ నటి కుష్బూకు అభిమానులు ఆలయాన్ని నిర్మించారు. ఇప్పుడు ఇక ఇదే తరహాలో తమిళనాడు సంస్కృతి ఏపికి పాకినట్లు కనబడుతోంది. ఏపిలోనూ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డికి గుడులు కడుతున్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం మండలం రాజుపాలెంలో సీఎం జగన్ గుడి నిర్మాణానికి ఈ నెల మొదటి వారంలో అభిమానులు శంకుస్థాపన చేశారు. ఆ కార్యక్రమానికి ఎమ్మెల్యే తలారి వెంకట్రావు కూడా పాల్గొన్నారు. ఇక్కడ అభిమానులు గుడి కడుతుంటే శ్రీకాళహస్తిలో ఏకంగా ఎమ్మెల్యే మధుసూధనరెడ్డి సీఎం జగన్ కు గుడి కట్టారు. సిఎం జగన్ పై ఉన్న ప్రేమ మరియు ఆయన అమలు చేస్తున్న నవరత్నాల పేరుతో దేవాలయాన్ని నిర్మించారు మధుసూధనరెడ్డి. రైతు భరోసా, పెన్షన్, ఆరోగ్య శ్రీ, అమ్మఒడి పేరుతో భారీ స్తూపాలు నిర్మించారు.
అలాగే పేదలకు ఇళ్లు, ఫీజు రీయింబర్స్మెంట్, జలయజ్ఞం ఫథకాల పేరుతో స్థూపాలను నిర్మించారు. నవరత్నాల సృష్టికర్త అంటూ జగన్మోహనరెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దాదాపు రెండు కోట్ల ఖర్చుతో ఈ ఆలయాన్ని ఎమ్మెల్యే మధుసూధనరెడ్డి నిర్మించారని తెలుస్తోంది. దేశంలో ఎక్కడా లేని పథకాలను సీఎం జగన్ అమలు చేస్తున్నారనీ, వైసీపీ ప్రభుత్వంలో ఏపి ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారని మధుసూధనరెడ్డి కొనియాడారు.
ఏపి సీఎం జగన్మోహనరెడ్డిని దైవాంశ సంభూతుడిగా భావిస్తూ గుడులు కడుతున్న వైసీపీ నేతల తీరు చూసి ప్రతిపక్ష పార్టీల నేతలు ముక్కున వేలేసుకుంటున్నారు. తమిళనాడు తరహా సంస్కృతి ఏపికి ప్రవేశించిందంటూ వ్యాఖ్యానిస్తున్నారు. ఏపిలో ఇంతకు ముందు ఏళ్ల తరబడి పాలన సాగించిన వివిధ పార్టీల నేతల విషయంలో ఎవరూ ఈ తరహా నిర్ణయాలు తీసుకోకపోవడం గమనార్హం.