Huzurabad By Poll: హూజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నిక త్వరలో జరగనుండగా, కాంగ్రెస్ కూడా తమ అభ్యర్థిని ప్రకటించింది. మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో హూజూరాబాద్ ఉప ఎన్నిక అనివార్యమైంది. టీఆర్ఎస్ నుండి బయటకు వచ్చిన ఈటల రాజేందర్ బీజేపీ నుండి పోటీ పడుతుండగా, టీఆర్ఎస్ తరపున విద్యార్ధి విభాగం అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను బరిలోకి దించింది. ఉప ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాకముందు నుండే టీఆర్ఎస్, బీజేపీ నేతలు నియోజకవర్గంలో ప్రచార పర్వాన్ని నిర్వహిస్తూ వచ్చారు. ఈటల రాజేందర్ ను ఎలాగైనా దెబ్బతీయాలన్న లక్ష్యంతో అధికార టీఆర్ఎస్ సర్వశక్తులను ఒడ్డుతోంది.
Huzurabad By Poll: ఈటల వర్సెస్ కేసిఆర్ గా రసవత్తర పోటీ
మంత్రి హరీష్ రావు నేతృత్వంలో పలువురు మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పూర్తి బాధ్యతలతో నియోజకవర్గంలో ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. మరో పక్క ఈటల రాజేందర్, బీజేపీ నేతలు విస్తృతంగా ప్రచరాం నిర్వహిస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నియోజకవర్గంలో కేసిఆర్ ను, టీఆర్ఎస్ ను టార్గెట్ గా చేస్తూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. కేసిఆర్ వర్సెస్ ఈటల గా నియోజకవర్గంలో రసవత్తర పోటీ నెలకొని ఉండగా, కాంగ్రెస్ పార్టీ ఎన్ఎస్ యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ నర్శింహరావు బల్మూరిని హూజూరాబాద్ ఉప ఎన్నికల బరిలోకి దింపింది. ఈ మేరకు ఏఐసీసీ ఓ ప్రకటన విడుదల చేసింది. వెంకట్ బల్మూరి ఇటీవల కాలంలో కాంగ్రెస్ నిరసన ప్రదర్శనలు, ధర్నాల్లో ముందు నిలిచి పోరాడుతూ పార్టీ అధిష్టానం దృష్టిలో పడ్డారు.
ఎన్ఎస్ యూఐ నేత వెంకట్ బల్మూరు
హూజూరాబాద్ అభ్యర్థిపై పార్టీలో తీవ్ర చర్చ జరగ్గా, వెంకట్ బల్మూరి పేరును సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనను టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమర్థించడంతో రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ చార్జి మాణిక్యం ఠాగూర్ సిఫార్సుతో ఏఐసీసీ వెంకట్ పేరను ఖరారు చేసింది. టీఆర్ఎస్ తరపున ఆ పార్టీ విద్యార్ధి నాయకుడు పోటీ చేస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్ఎస్ యుఐకి రెండు పర్యాయాలుగా అధ్యక్షుడుగా బాధ్యతలు నిర్వహిస్తున్న విద్యార్ధి విభాగం నేత బల్మూరు వెంకట్ ను దింపడం ప్రాధాన్యతను సంతరించుకుంది. హుజూరాబాద్ ఉప ఎన్నికల పోలింగ్ ఈ నెల 30వ తేదీన జరగనుంది. నవంబర్ 2వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుంది. నామినేషన్ ల దాఖలు గడువు ఈ నెల 8వ తేదీ వరకూ ఉంది.