Huzurabad By Election Exit Poll: హూజూరాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో పోలింగ్ ఘట్టం పూర్తి అయ్యింది. నువ్వా నేనా అన్న రీతి ఇక్కడి అధికార టీఆర్ఎస్, బీజేపీ మధ్య పోటీ జరిగింది. ఇక్కడ పోటీ బీజేపీ, టీఆర్ఎస్ అనే కంటే సీఎం కేసిఆర్ వర్సెస్ ఈటల అన్నట్లుగానే సాగింది. టీఆర్ఎస్ ఆవిర్భావం నుండి కేసిఆర్ వెంట నడిచి వరుసగా ఎన్నికల్లో విజయం సాధిస్తూ వచ్చిన ఈటల రాజేందర్ ను భూకబ్జా ఆరోపణలతో మంత్రి వర్గం నుండి కేసిఆర్ భర్తరఫ్ చేయడంతో ఆయన ఎమ్మెల్యే పదవికి, పార్టీకి రాజీనామా చేసి బీజేపీ అభ్యర్ధిగా రంగంలో దిగారు. దీంతో కేసిఆర్ ఇజ్జత్ కే సవాల్ అన్నట్లు ఈటల రాజేందర్ అసెంబ్లీలోకి అడుగుపెట్టకూడదన్న లక్ష్యంతో సర్వశక్తులను అధికార పార్టీ ఒడ్డింది. సాధారణంగా ఉప ఎన్నికల్లో ఓటింగ్ శాతం తగ్గుతుంటుంది. కానీ ఈ సారి జరిగిన ఉప ఎన్నికల్లో గత అసెంబ్లీ ఎన్నికల కంటే పోలింగ్ శాతం పెరిగింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 84.05శాతం పోలింగ్ నమోదు అయ్యింది. ఈటల పూర్తిగా సానుభూతి,తో పాటు నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి తన విజయానికి కారణం అవుతాయని ధీమా ఉన్నారు. మరో పక్క కేసిఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, దళిత బంధు, అభివృద్ధి కారణంగా టీఆర్ఎస్ అభ్యర్ధి గెల్లు శ్రీనివాస్ యాదవ్ విజయం డిసైడ్ అయ్యిందని మంత్రి హరీష్ రావు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎవరికి వారు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తుండగా అభ్యర్ధుల గెలుపు ఓటములపై భారీ ఎత్తున బెట్టింగ్ లు కూడా సాగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. గెలుపు ఎవరిది అన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొనగా కొన్ని సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి.
Huzurabad By Election Exit Poll: ఎగ్జిట్ పోల్స్ ఈటలకే మొగ్గు
ఆత్మసాక్షి సర్వే ప్రకారం బీజేపి అభ్యర్ధి ఈటల రాజేందర్ కు 50.5 శాతంతో విజయం సాధిస్తారని చెప్పింది. 43.1 శాతం ఓట్లతో టీఆర్ఎస్ అభ్యర్ధి గెల్లు శ్రీనివాస్ యాదవ్ రెండవ స్థానంలో ఉంటారనీ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి వెంకట్ బల్మూరుకు కేవలం 5.7 శాతం ఓట్లు వస్తాయని అంచనా వేసింది. ఇక పీపుల్స్ పల్స్ మూడ్ సర్వే చెప్పిన లెక్కల ప్రకారం బీజేపీ స్వల ఆధిక్యతతో విజయం సాధించే అవకాశాలు ఉన్నట్లు తెలిపింది. బీజేపీ, టీఆర్ఎస్ మధ్య 7 నుండి 9 శాతం ఓట్ల వ్యత్యాసం ఉండే అవకాశం ఉన్నట్లు చాన్స్ ఉన్నట్లు స్పష్టం చేస్తోంది. సాామాజిక వర్గాలు, ముఖ్యంగా యువత బీజేపీకి మద్దతు తెలిపినట్లు వెల్లడించింది.
పెరిగిన ఓటింగ్ శాతంతో గుబులు
మరో పక్క ఓటింగ్ శాతం పెరగడంతో ప్రధాన రాజకీయ పక్షాల్లో గుబులు రేగుతోంది. ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉన్నా చివరి నిమిషంలో పెరిగిన ఓటింగ్ శాతం వల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం అనేదానిపై కాకిలెక్కలు వేస్తున్నారు. పెరిగిన ఓటింగ్ ఎవరికి మేలు చేస్తుంది అన్నది ఆసక్తికరంగా మారింది. సర్వే సంస్థలు, ఇంటెలిజెన్స్ నివేదికలు ఓటరు నాడి పసిగట్టడం కొంత కష్టతరంగా మారిందని అంటున్నాయి. ప్రజా తీర్పు ఎలా ఉందో తెలుసుకోవాలంటే నవంబర్ 2వ తేదీ వరకూ ఆగాల్సిందే.