AP Minister Anil kumar Yadav: ఏపిలో ఇటీవల వరదలకు కడప జిల్లా అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయి తీవ్ర ప్రాణ, ఆస్తినష్టం జరిగిన విషయం తెలిసిందే. అయితే కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఈ బాధ్యత రాష్ట్రానిది కాదా అని నిలదీశారు. ఆనకట్టల భద్రత బిల్లుపై జరిగిన చర్చలో కేంద్ర మంత్రి షెకావత్ ఈ విషయాన్ని ప్రస్తావించారు. పెద్ద ఎత్తున వరద వచ్చినప్పుడు స్పిల్ వే తో పాటు గేట్లు మొత్తం తెరిచి వచ్చిన వరద వచ్చినట్లు బయటకు పంపాల్సింది కానీ అక్కడ డ్యామ్ కు ఉన్న అయిదు గేట్లలో ఒక గేటు తెరుచుకోలేదు, ఎందుకంటే అది పని చేయడం లేదు. దానికి బాధ్యత ఎవరిదని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఆ బాధ్యత లేదా అని ప్రశ్నించారు.
AP Minister Anil kumar Yadav: అవగాహన రాహిత్యంతోనే వ్యాఖ్యలు
కేంద్ర మంత్రి షెకావత్ చేసిన ఈ వ్యాఖ్యలకు ఏపి జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ధీటుగా కౌంటర్ ఇచ్చారు. ఆయన వ్యాఖ్యలు పూర్తిగా అవగాహన రాహిత్యంతో కూడినవని విమర్శించారు. ప్రాజెక్టు గేట్ల కెపాసిటీకి మించి హఠాత్తుగా వచ్చిన వరదతోనే అన్నమయ్య ప్రాజెక్టు వద్ద అనూహ్యంగా వరద కట్టలు తెంచుకుందని అన్నారు. ఇటువంటి ఘటనే ఉత్తరాఖండ్ లో ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన విషయాన్ని గుర్తు చేస్తూ అప్పుడు 150 మంది జల సమాధి అయ్యారనీ, అయితే అక్కడ అధికారంలో ఉంది బీజేపీ ప్రభుత్వం కనుక నిజాలు దాచే ప్రయత్నం చేశారని అనిల్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అన్నమయ్య ప్రాజెక్టులో అయిదవ గేటు తెరుచుకున్నా అందులో నుండి బయటకు వెళ్లగల నీటి సామర్థ్యం 40వేల క్యూసెక్కులు అయితే విరుచుకుపడిన వరద 3 లక్షల క్యూసెక్కులకు పైనే కాబట్టి ఒక గేటు తెరుచుకోలేదన్న వాదనకు విలువ లేదని వివరణ ఇచ్చారు.
ఎంపిలు సీఎం రమేష్, సుజనా చౌదరిలు టీడీపీ తరపున షెకావత్ కు తప్పుడు సమాచారం ఇవ్వడం వల్ల ఇలా మాట్లాడి ఉంటారని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇక్కడ ఏమి జరిగింది అనే విషయాన్ని జిల్లా కలెక్టర్ నుండి గానీ, ప్రాజెక్టు అధికారుల నుండి గానీ కేంద్ర ప్రభుత్వం సంప్రదించకుండా, రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగకుండా నిరాధారాలతో ఇటువంటి ప్రకటన చేయడం ఎంత వరకు సమంజసమని వారు కూడా ఆలోచించుకోవాలన్నారు. కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యలను పట్టుకుని టీడీపీ దుష్ప్రచారం చేస్తుందని మండిపడ్డారు.