ఢిల్లీ: ఈవిఎంలతో పాటు 50 శాతం వివిప్యాట్ యంత్రాల స్లిప్పులను లెక్కించేలా ఆదేశాలు ఇవ్వాలని దాఖలైన పిటిషన్లపై సోమవారం సుప్రీంకోర్టు విచారణ జరిపింది. కేంద్ర ఎన్నికల సంఘం దాఖలు చేసిన కౌంటర్ అఫడివిట్పై పిటిషనర్ తరఫు న్యాయవాదులు సమయం అడగడంతో జస్టిస్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం కేసును ఏప్రిల్ 8వ తేదీకి వాయిదా వేసింది.
ప్రతి నియోజకవర్గం పరిధిలో కనీసం 50 శాతం వివి ప్యాట్లను లెక్కించేలా ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేయాలంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సహా దాదాపు 21 పార్టీల నేతలు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దీనిపై గత నెల 25 వ తేదీన విచారణ చేపట్టిన న్యాయస్థానం వివిప్యాట్ స్లిప్పులను లెక్కించడంలో ఉన్న అభ్యంతరాలు తెలుపుతూ అఫిడవిట్ దాఖలు చేయాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. కేసు విచారణను ఏప్రిల్ 1 వ తేదీకి వాయిదా వేసింది.
దీంతో ఎన్నికల సంఘం గత శుక్రవారం తమ స్పందన తెలియజేసింది. లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో వివి ప్యాట్ స్లిప్పుల లెక్కింపును పెంచాల్సిన అవసరం లేదని కేంద్ర ఎన్నికల సంఘం సుప్రీం కోర్టుకు తెలిపింది. ఎన్నికల నిర్వహణకు ప్రస్తుతమున్న విధానం సరైందేనని, రానున్న ఎన్నికల్లోనూ ఇదే విధానాన్ని అవలంబిస్తామని ఎన్నికల సంఘం వెల్లడించింది. 50 శాతం స్లిప్లను లెక్కించాల్సిన అవసరం లేదని అఫిడవిట్లో పేర్కొంది.