Jinnah Tower: జాతీయ పార్టీ.. పెద్ద పెద్ద నాయకులు.. నోరు ఎత్తారంటే అమరావతి కట్టేస్తాం.., విశాఖని ఉద్దరించేస్తాం.., పోలవరం నిర్మించేస్తాం.., ఏపీని మరో అమెరికాలాగా మార్చేస్తాం అంటారు..! కానీ కేంద్రాన్ని కలిసి కనీసం వాటికి నిధులు అడగలేరు, కనీసం చొరవ చూపించరు..! పైగా ఎక్కడ గుళ్ళు పగిలినా.., ఎక్కడ ఏ ముస్లిం సెంటిమెంట్ సెంటర్ ఉన్నా రాజకీయానికి వాలిపోతారు.. ఇదీ ఏపీలో బీజేపీ పరిస్థితి. ఓటు కోసం, సీటు కోసం నానా యాగీ చేస్తూ.., తిప్పలు పడుతున్న రాష్ట్ర బీజేపీ నాయకుల పరిస్థితి చూస్తుంటే కనీసం ఆ పార్టీకి ఈ సారి ఒక్కశాతమైనా ఓటింగ్ పెరగాలని ఏపీలో కొందరికి సానుభూతి పుట్టే పరిస్థితి కనిపిస్తుంది..! తాజాగా గుంటూరులోని జిల్లా సెంటర్ పై ఏపీ బీజేపీ రాజకీయ కళ్ళు పడ్డాయి. ఆ సెంటర్ పేరు మార్చాలంట, ఆ సెంటర్ పై జాతీయ జెండా ఎగుర వేయాలంట, ఆ సెంటర్ ని రాజకీయంలోకి లాగేసి.. ఏపీలో మత రాజకీయం రుద్దాలనే బీజేపీ ప్రయత్నాలను పాపం ఎవ్వరూ పట్టించుకోవడం లేదు..!
Jinnah Tower: జిన్నా గొడవేమిటి..!?
గుంటూరులో జిన్నా టవర్ అనే ఒక ప్రముఖ కూడలి, టవర్ ఉంది. ఇది ఆ ప్రాంతంలో ముస్లింలకు సెంటిమెంట్. ఆ ప్రాంతంలో ఇది ఖ్యాతి గాంచిన కూడాలి.. దీనికి కొన్ని కథలున్నాయి. అప్పట్లో స్వతంత్రం రాకమునుపు పాకిస్తాన్ కి చెందిన మహమ్మద్ అలీ జిన్నా ఇక్కడ రావాలనుకున్న.. కానీ రాలేకపోయారు. అందుకే ఆయన స్మారకంగా స్థానిక ముస్లింలు ఆ టవర్ నిర్మాణం పూర్తి చేసారు. దీన్ని పూర్తిగా సెంటిమెంట్ గా తమ మనోభావాలతో ముడిపెట్టి ఆరాధ్యంగా భావిస్తున్నారు. సరిగ్గా ఇదే సమయంలో మత రాజకీయం కోసం కాసుక్కూర్చునే ఏపీ బీజేపీ నాయకులకు ఆ టవర్ కనిపించింది. దీనిపై రాజకీయం చేసి హిందువులను రెచ్చగొట్టవచ్చు అనుకుంది.. అనుకున్నదే తడవుగా బీజేపీ నేత సత్యకుమార్ నెల రోజుల కిందట ఒక ట్వీస్ట్ చేసారు. గుంటూరులోని జిన్నా టవర్ కి జాషువా లేదా కలాం పేరు పెట్టాలని కోరారు. దీంతో దీనిపై వివాదం మొదలయింది. పేరు మార్చడం ఏ మాత్రం కుదరదు అంటూ స్థానిక ముస్లిం నేతలు చెప్తున్నారు. గుంటూరులోని ఈ ప్రాంతంలో, ఈ నియోజకవర్గంలో దాదాపు 20 శాతం ఓటింగ్ ముస్లింలే.. అందుకే ఈ జోలికి వైసీపీ వెళ్లడం లేదు. కానీ.. మొత్తం విషయం, సెంటిమెంట్ తెలిసి కూడా బీజేపీ ఒక మత ప్రాదిపదిక రాజకీయానికి తెరతీసింది..! నిన్న కూడా గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆ టవర్ పై జాతీయ పతాకం ఆవిష్కరించాలని బీజేపీ నేతలు విఫలయత్నం చేశారు.
అప్పుడు బీజేపీ ఏం చేసింది..!!
ఏపీలో బీజేపీ గతంలో రెండు సార్లు అధికార కూటమిలో ఉంది. 1999 నుండి 2004 మధ్య టీడీపీతో పొత్తులో భాగంగా ఏపీలో అధికారంలో ఉంది. అప్పుడు కొందరు బీజేపీ నేతలు మంత్రులుగా కూడా పని చేసారు. తర్వాత 2014 నుండి 2019 వరకు కూడా ఏపీలో బీజేపీ టీడీపీతో కలిసి పొత్తులో ఉంది. అప్పుడు బీజేపీ నేత దివంగత పైడికొండల మాణిక్యాలరావు దేవాదాయ శాఖ మంత్రిగా పని చేసారు. కానీ బీజేపీ ఆ రెండు సందర్భాల్లో ఈ జిన్నా టవర్ జోలికి వెళ్ళలేదు. కనీసం దీన్ని గుర్తించలేదు. కానీ బీజేపీకి ఉనికి కావల్సి వచ్చినప్పుడు.. జనం ఆ పార్టీని మర్చిపోతారేమో అనే భయం వేసినప్పుడు.. ఏదైనా రాజకీయం చేయాలనుకుంటున్నప్పుడు హిందూ సెంటిమెంట్ రగిల్చేందుకు, ముస్లింలను కెలికే కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. దానిలో భాగంగా తాజాగా బీజేపీ రాజకీయ కళ్ళు ఈ జిన్నా టవర్ పై పడ్డాయనేది రాజకీయ విశ్లేషకుల వాదన..!