PAWAN KCR: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని, ప్రధాని మోదీ తీరుని సీఎం కేసీఆర్ ఓ రేంజ్ లో దుయ్యబడుతున్నారు. మొన్నటి బడ్జెట్ తర్వాత ఓ ప్రెస్ మీట్, నిన్న ఓ ప్రెస్ మీట్ పెట్టి బీజేపీని దూనమాడుతున్నారు.. ఉదాహరణలు చూపి మరీ విమర్శిస్తున్నారు. మొత్తంగా చూస్తే కేంద్రంపై కేసీఆర్ పొలిటికల్ వార్ డిసైడ్ చేసేశారు. ఎందరో నాయకులు తనతో టచ్ లో ఉన్నారని.. అవసరమైతే జాతీయస్థాయిలో మరో పార్టీ పెడతానని అంటున్నారు. రాఫెల్ యుద్ధ విమానాల్లో కుంభకోణాలు జరిగాయని, ఆర్ధిక నేరగాళ్లు దేశం దాటేస్తున్నారని, విద్యుత్ సంస్కరణల పేరుతో రాష్ట్రాలను మోసం చేస్తోందని కేంద్రం తీరును ఎండగడుతున్నారు. ఈక్రమంలో.. ‘దేశం నుంచి బీజేపీని గెంటేయాలి.. లేదంటే దేశం నాశనమైపోతుంది’ అని అంటున్నారు.
పవన్ నినాదం అలా..
కేసీఆర్ తరహాలోనే 2014లో పవన్ కల్యాణ్ జనసేన పార్టీ ఆవిర్భావ సభలో కాంగ్రెస్ పై ఇదే స్థాయిలో విరుచుకుపడ్డారు. ‘కాంగ్రెస్ హఠావో.. దేశ్ బచావో’ అని పవన్ కల్యాణ్ ఇచ్చిన పిలుపు ప్రకంపనలే రేపింది. మొత్తంగా పదేళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.. జాతీయస్థాయిలో కూడా ఓడిపోయింది. ఇప్పుడు.. 2024లో మళ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. అప్పటికి పదేళ్లు అధికారం పూర్తి చేసుకోబోతున్న బీజేపీకి అధికారం దూరం చేయటమే కాదు.. ఏకంగా దేశం నుంచే ఆ పార్టీని గెంటేయాలని పిలుపునిస్తున్నారు కేసీఆర్. నాడు పవన్ పార్టీ అధ్యక్షుడు మాత్రమే. కానీ.. నేడు కేసీఆర్ పార్టీ అధ్యక్షుడే కాదు.. రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా. కాబట్టి.. కేసీఆర్ వాదనకు ఇంకా బలం ఉంటుంది.
కేసీఆర్ మాట ఇలా..
బీజేపీ వ్యతిరేక నేతలతోనే కాకుండా.. రాష్ట్రాల సీఎంలతో కూడా చర్చిస్తున్నారు కేసీఆర్. పదేళ్లు అధికారంలో ఉన్న పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత వస్తుందనేది ఓ మాట. కేసీఆర్ కూడా ఇదే ఆలోచిస్తున్నట్టు చెప్పాలి. బీజేపీపై వ్యతిరేకతను చూపి.. ఇతర రాష్ట్రాల్లోని పార్టీల అధినేతలను కలుపుకుని బీజేపీ గద్దె దించాలనేది ఆయన ప్లాన్. అయితే.. ఎవరెవరు వస్తారు.. కొత్త పార్టీ పెడతారా.. ఫ్రంట్ గా ఏర్పడతారా.. ప్రధాని అభ్యర్ధి ఎవరు..? ఇవన్నీ ప్రస్తుతానికి సమాధానం లేని ప్రశ్నలే. మొత్తంగా.. 2014లో జరిగిన అధికార మార్పిడి.. 2024లో కూడా జరుగుతుందా..? పవన్ మాటలా.. కేసీఆర్ మాట శాసనమవుతుందా..? వేచి చూడాల్సిందే..!