తెలంగాణలో బీజేపీకి అధికారం, కేసిఆర్ కు విశ్రాంతి అవసరమని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డా అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ 5వ విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభ కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానంలో గురువారం జరిగింది. ఈ సభకు ముఖ్య అతిధిగా పాాల్గొన్న పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా .. కేసిఆర్ పాలనపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసిఆర్ పాలన అంతా అవినీతి, అక్రమాలేనని దుయ్యబట్టారు. ముందుగా వేమలవాడ రాజన్న, కొండగట్టు అంజన్న కు ప్రణామాలు అంటూ ప్రసంగాన్ని ప్రారంభించిన జేపి నడ్డా.. కరీంనగర్ ఉద్యమాల గడ్డ అని కొనియాడారు. బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర ఆరంభం మాత్రమే ఆగేది కాదని అన్నారు. ఇక పై ప్రజా గోస – బీజేపీ భరోసా కార్యక్రమం కొనసాగుతుందని జేపి నడ్డా తెలిపారు.
కేసిఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేశారని విమర్శించారు. దోచుకోవడం – దాచుకోవడమే కేసిఆర్ సర్కార్ పనిగా పెట్టుకుందని ఆరోపించారు. దళితుడిని సీఎం చేస్తానన్న కేసిఆర్ హామీ ఏమైందని జేపి నడ్డా ప్రశ్నించారు. కేసిఆర్ కు కుటుంబ పాలన తప్ప ప్రజా సంక్షేమం పట్టదని విమర్శించారు.ధరణి పోర్టల్ టీఆర్ఎస్ నాయకులు దోపిడీ చేసేందుకే ఉపయోగపడుతుందని అన్నారు. పేదలకు డబుల్ బెడ్ రూం ఇండ్లు, రైతులకు రుణమాఫీ, నిరుద్యోగ భృతి… ఏ హామీ కేసీఆర్ నెరవేర్చలేదని నడ్డా పేర్కొన్నారు. ఎంఐఎంతో దోస్తీ చేసిన కేసిఆర్ సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవం జరిపేందుకు వెనుకాడారనీ, కానీ తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవించిన బిజెపి కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేతృత్వంలో ఈ సెప్టెంబర్ 17న విమోచన ఉత్సవాలు నిర్వహించిన విషయాన్ని గుర్తు చేశారు.
సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రయాస్ తన విధానమని అన్నారు. ఒక ఆదివాసీమహిళ, దళితుడు రాష్ట్రపతి కాగలరని ఎప్పుడైనా ఊహించారా అని ప్రశ్నించారు. 12 మంది దళితులు, 8 మంది ఆదివాసీలు, 20కు పైగా బీసీలు ఎప్పుడైనా కేంద్ర మంత్రులుగా ఉన్నారా..? అని జేపి నడ్డా ప్రశ్నించారు. ఈ సభల్లో పాల్గొనేందుకు వస్తుంటే తనను కూడా టీఆర్ఎస్ అడ్డుకోవాలని ప్రయత్నించిందనీ, ఇలా అడ్డుకోవడమే ప్రజాస్వామ్యమా..? అని ప్రశ్నించారు. తెలంగాణలో టీఆర్ఎస్ అవినీతి సర్కార్ కు చరమగీతం పాడి, బిజెపి ప్రభుత్వం ఏర్పడేదాకా విశ్రమించమని శపథం చేశారు జేపి నడ్డా. బీజేపీ మాత్రమే కేసిఆర్ ను గద్దె దించగలదని అన్నారు. సీఎం కేసిఆర్ కు ప్రజలు గుడ్ బై చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ త్వరలోనే విఆర్ఎస్ కాబోతున్నదని జేపి నడ్డా సెటైర్ వేశారు. జేపి నడ్డా పర్యటన నేపథ్యంలో బీజేపీ భారీగా జనసమీకరణ చేసింది. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Viral Video: ట్రక్కు నుండి జారిన తాడు బైక్ పై వెళుతున్న యువకుడి మెడకు.. ఆ తర్వాత ఏమైందంటే..?