Election Commission: ఆంధ్రప్రదేశ్ లో శాసనసభ ఎన్నికల కసరత్తును కేంద్ర ఎన్నికల సంఘం ప్రారంభించింది. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఏడుగురు కేంద్ర ఎన్నికల అధికారుల బృందం రాష్ట్రానికి చేరుకుంది. విజయవాడలోని నోవాటెల్ హోటల్ నందు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్షా సమావేశం నిర్వహించింది. సీనియర్ డిప్యూటి ఎన్నికల కమిషనర్లు ధర్మేంద్ర శర్మ, నితేష్ వ్యాస్ సహా డిప్యూటి ఎన్నికల కమిషనర్లు హిర్దేశ్ కుమార్, అజయ్ బాదో తదితరులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.
వచ్చే సార్వత్రిక ఎన్నికల సన్నద్దత, ఇతర అంశాలపై చర్చిస్తున్నారు. జిల్లాల వారీగా ఓటర్ల జాబితా తయారీ తదితర అంశాలపై నివేదికల ఆధారంగా సమీక్షిస్తున్నారు. రాష్ట్రంలోని ఓటర్ల జాబితాల్లో అక్రమాలు, అవకతవకలు, లోపాలపై వచ్చిన ఫిర్యాదులపై తీసుకున్న చర్యలపై కూడా జిల్లా ఎన్నికల అధికారులను ప్రశ్నిస్తున్నారు. రేపు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్), డీజీపీ తదితర ఉన్నతాధికారులతోనూ ఈసీ బృందం భేటీ కానుంది.
కేంద్ర ఎన్నికల బృందం రాష్ట్రానికి చేరుకుని సమీక్షలు జరుపుతుండటంతో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ముందుగానే విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లుగా భావిస్తున్నారు. ఫిబ్రవరి రెండో వారంలోనే ఎన్నికల షెడ్యూల్ విడుదల అవుతుందని అంటున్నారు. అందుకే కేంద్ర ఎన్నికల సంఘం అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టిందని వార్తలు వినబడుతున్నాయి.