Tirumala: ఉద్యోగులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. ఇళ్ల స్థలాల పంపిణీ, కాంట్రాక్ట్ కార్మికులకు వేతనాల పెంపుపై ధర్మకర్తల సమావేశం ఆమోదం తెలిపింది. టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు భూమన కరుణాకరరెడ్డి అధ్యక్షతన మంగళవారం తిరుమల అన్నమయ్య భవనంలో ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు.
సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ఆదేశాల మేరకు టీటీడీ ఉద్యోగుల ఇళ్లస్థలాల పంపిణీ వివిధ దశల్లో చేయడం జరుగుతుందని చైర్మన్ కరుణాకర్ రెడ్డి తెలిపారు. ఇందుకు సంబంధించి మొదటి దఫా 3,518 మందికి ఈ నెల 28న ఇళ్లస్థలాలు పంపిణీ చేస్తున్నామని భూమన తెలిపారు. రెండో దఫా జనవరి మొదటి వారంలో 1500 మందికి ఇళ్లస్థలాల పంపిణీ చేపడతామని చెప్పారు. మూడో దఫాలో ఏర్పేడు సమీపంలోని పాగాలి వద్ద 350 ఎకరాల భూమి కొరకు కలెక్టరును కోరడం జరిగిందన్నారు. దీని వల్ల 5 వేల మందికి లబ్ధి చేకూరుతుందని తెలిపారు. వీరికి ఫిబ్రవరిలో ఇళ్లస్థలాల పంపిణీకి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
బోర్డులో ఆమోదించిన ఇతర కీలక నిర్ణయాలు
- సనాతన హిందూ ధర్మప్రచారంలో భాగంగా ఫిబ్రవరి నెలలో తిరుమలలో పీఠాధిపతులు, మఠాధిపతుల సదస్సు నిర్వహించాలని సమావేశం నిర్ణయించింది.
- శ్రీవారి పోటు కార్మికులకు రూ.10 వేలు వేతనం పెంచాలని నిర్ణయించారు. అదేవిధంగా ఎంతో కష్టంతో కూడిన విధులు నిర్వహిస్తున్న వాహనబేరర్లు, ఉగ్రాణం కార్మికులను స్కిల్డ్ కేటగిరీగా గుర్తించి తగిన వేతనం పెంపునకు నిర్ణయం.
- వందల సంవత్సరాలుగా శ్రీవారి ఆలయ అర్చక కైంకర్యాలను పర్యవేక్షిస్తున్న శ్రీ పెద్ూజీయర్ మఠానికి రూ.60 లక్షలు, శ్రీ చిన్నజీయర్ మఠానికి రూ.40 లక్షలు ఆర్థిక సహకారం పెంపునకు నిర్ణయం.
- టీటీడీలోని పలు విభాగాల్లో వర్క్ కాంట్రాక్టు పద్ధతిలో సేవలందిస్తున్న కార్మికులకు వేతనాలు పెంచడం జరిగింది. స్కిల్డ్ కార్మికులకు రూ.15 వేల నుండి రూ.18,500కు, సెమిస్కిల్డ్ కార్మికులకు రూ.12 వేల నుండి రూ.15 వేలకు, అన్స్కిల్డ్ కార్మికులకు రూ.10,340 నుండి రూ.15 వేలకు పెంచడం జరిగింది.
- జిఓనం. 110, తేదీ : 13-03-2023 ప్రకారం కల్యాణకట్టలో విధులు నిర్వహిస్తున్న పీస్రేట్ క్షురకులకు నెలకు రూ.20 వేలు కనీస వేతనం చెల్లించేందుకు ఆమోదం.
- రూ.14.47 కోట్లతో తిరుమలలోని ఔటర్ రింగ్ రోడ్డులో గోగర్భం డ్యామ్ సర్కిల్ వరకు శాశ్వత క్యూలైన్ల నిర్మాణానికి టెండరు ఖరారుకు ఆమోదం.
- తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి సత్రం(రెండో సత్రం) స్థానంలో జిఎస్టీ కాకుండా రూ.209.65 కోట్లతో అచ్యుతం వసతి సముదాయం, శ్రీకోదండరామస్వామి సత్రం(మూడో సత్రం) స్థానంలో జిఎస్టీ కాకుండా రూ.209.65 కోట్లతో శ్రీపథం వసతి సముదాయం నిర్మాణానికి టెండర్లు ఆమోదం.
- తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలో పాలనా సౌలభ్యం కోసం రూ.6.15 కోట్లతో సెంట్రలైజ్డ్ రికార్డు స్టోర్ నిర్మాణానికి టెండరు ఆమోదం.
- రూ.7.31 కోట్లతో వంటషెడ్లు, మరుగుదొడ్ల బ్లాక్లు, ఫుట్పాత్ల అభివృద్ధి, శాశ్వత క్యూలైన్ల ఏర్పాటుకు టెండరు ఖరారుకు ఆమోదం.
- అలిపిరిలో రూ.7.24 కోట్లతో నూతన పార్కింగ్ ప్రాంతాల ఏర్పాటుకు టెండరు ఖరారు. వీటితో పాటు రూ.1.94 కోట్లతో అలిపిరి బస్టాండు, పార్కింగ్ ప్రాంతంలో బిటి రెన్యువల్ రోడ్డు ఏర్పాటుకు టెండరు ఆమోదం.
- తిరుమల హెచ్విసి ప్రాంతంలో మిగిలి ఉన్న కాటేజీల్లో రూ.1.82 కోట్లతో ప్రత్యేక అభివృద్ధి పనులు, మరమ్మతులు చేపట్టేందుకు టెండరు ఆమోదం.
- శ్రీనివాసం విశ్రాంతి సముదాయంలో బస చేసే భక్తుల సౌకర్యం కోసం శ్రీనివాసం తూర్పువైపున రూ.2 కోట్లతో ఓపెన్ డ్రెయిన్ నిర్మాణానికి టెండరు ఆమోదం.
- తిరుమలలో యాత్రికుల కాటేజీల్లో నివాసమున్న పోలీసు సిబ్బందిని ఖాళీ చేయించే నిమిత్తం పాత పోలీసు క్వార్టర్ట్స్ను రూ.2.87 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టేందుకు టెండరు ఖరారుకు ఆమోదం.
- రూ.6.32 కోట్లతో వరాహస్వామి విశ్రాంతి గృహం నుండి ఔటర్ రింగ్ రోడ్డు వరకు నాలుగు లైన్ల రోడ్డు ఏర్పాటుకు టెండర్ల ఆమోదం.
- చెర్లోపల్లి నుండి శ్రీనివాసమంగాపురం దారిని నాలుగు లైన్ల రోడ్డుగా విస్తరించి బిటి రోడ్డు, వీధిదీపాలు, డ్రెయిన్లు, సుందరీకరణ పనులు చేపట్టేందుకు రూ.17.29 కోట్లతో టెండరు ఖరారుకు ఆమోదం.
- ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన జార్ఖండ్ రాష్ట్రం దేవ్ ఘర్లో ఆ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన వంద ఎకరాల స్థలంలో శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయం నిర్మించేందుకు ఆమోదం.
- చంద్రగిరిలోని శ్రీ మూలస్థాన ఎల్లమ్మ ఆలయంలో ప్రాకారం, కట్స్టోన్ ఫ్లోరింగ్, స్టోర్ గది, మండపం నిర్మాణానికి శ్రీవాణి ట్రస్టు నుండి రూ.2 కోట్లు కేటాయించాలని నిర్ణయం.
- తిరుపతిలోని అలిపిరి సప్తగోప్రదక్షిణ మందిరంలో జరుగుతున్న శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో పాల్గొనే భక్తులు తిరుమలలో సుపథం మార్గం ద్వారా రూ.300 టికెట్ కొనుగోలుచేసి శ్రీవారిని దర్శించుకునే అవకాశం కల్పిస్తున్నాం.
YS Sharmila: వైఎస్ షర్మిల ఏపీలో రాజకీయ రంగ ప్రవేశంపై పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు కీలక వ్యాఖ్యలు