YS Sharmila: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్ర వైఎస్ షర్మిల తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేందుకు సిద్దమైన సంగతి తెలిసిందే. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఈ కార్యక్రమం జరగాల్సి ఉండగా, వాయిదా పడింది. తెలంగాణలో షర్మిల పెత్తనాన్ని, రాజకీయాన్ని రేవంత్ రెడ్డి సహా పలువురు వ్యతిరేకించడంతో పార్టీ అధిష్టానం వైఎస్ఆర్ టీపీ విలీన ప్రక్రియను హోల్డ్ లో పెట్టింది.
అయితే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఆదే జోష్ లో ఏపీలోనూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి వైఎస్ షర్మిలను ఉపయోగించుకోవాలని పార్టీ అధిష్టానం భావిస్తొందనీ, షర్మిలకు ఏపీ పీసీసీ పగ్గాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. అయితే దీనికి సంబంధించి అటు షర్మిల నుండి గానీ అటు పార్టీ హైకమాండ్ నుండి కానీ ఇంత వరకూ ఎటువంటి స్పష్టత రాలేదు. సోదరుడైన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో వైఎస్ షర్మిలకు విభేదాలు, మనస్పర్థలు ఉన్నాయనేది అందరికీ తెలిసిందే. అయితే పార్టీ అధిష్టానం ఆదేశిస్తే షర్మిల తన పార్టీని విలీనం చేసి ఏపీ రాజకీయాల వైపు వస్తారా లేదా అన్న చర్చ మాత్రం జోరుగా సాగుతోంది.
ఒక వేళ షర్మిల ఏపీ రాజకీయాల్లో ప్రవేశిస్తే రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్న ఘోర పరిస్థితి నుండి కొంత మెరుగవుతుందని, ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉందనే మాట వినబడుతోంది. దీనిపై తాజాగా ఏపీ పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు స్పందించారు. వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ లోకి వస్తే అహ్వానిస్తామని తెలిపారు. అయితే షర్మిలకు పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలి బాధ్యతలు అప్పగిస్తారు అన్న దానిపై తన వద్ద ఎలాంటి సమాచారం లేదని అన్నారు. కాంగ్రెస్ హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా తాము కట్టుబడి ఉంటామని తెలిపారు.
వైఎస్ఆర్ తనయగా వైఎస్ షర్మిల పార్టీలోకి వచ్చి పని చేస్తామంటే అందరూ స్వాగతించాల్సిందేనని అన్నారు. నిబద్దత కల్గిన కార్యకర్తగా అందరం పని చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో నిర్ణయాధికారి పార్టీ అధిష్టానానిదేనని అన్నారు. షర్మిల కాంగ్రెస్ పార్టీ లో చేరి పని చేయడంపై అభ్యంతరం పెట్టే వారు ఎవరూ ఉండరని అన్నారు. అందరూ పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిందేనని చెప్పారు. వ్యక్తిగత ఆలోచనలు, అభిప్రాయాలకు జాతీయ పార్టీలో తావు లేదని గిడుగు స్పష్టం చేశారు.
Vyooham: ‘వ్యూహం’ సినిమా పై హైకోర్టులో విచారణ వాయిదా