AP Assembly: ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ గా నర్సీపట్నం ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు (అయ్యన్న) ఏకగ్రీవంగా ఎన్నికైయ్యారు. అయ్యన్న శనివారం స్పీకర్ గా బాధ్యతలు చేపట్టనున్నారు. అయితే ..శనివారం శాసనసభకు రాకూడదని వైసీపీ నిర్ణయించుకున్నట్లు తెలుస్తొంది.
స్పీకర్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి దూరంగా ఉండాలని మాజీ సీఎం వైఎస్ జగన్ భావించినట్లు సమాచారం. అందుకే శనివారం జగన్ వ్యక్తిగత పర్యటన పెట్టుకున్నారు. శనివారం ఉదయం 10 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుండి బయలుదేరి జగన్ పులివెందుల వెళ్లనున్నారు. మూడు రోజుల పాటు జగన్ పులివెందులలో ప్రజలకు అందుబాటులో ఉంటారని వైసీపీ వర్గాలు వెల్లడించారు.
సాధారణంగా ఎన్నికైన సభాపతిని అధికార, విపక్ష నేతలు ఆయన స్థానంలో కూర్చోబెట్టడం సంప్రదాయంగా వస్తున్నది. అయితే ఈ ఎన్నికల్లో వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. కేవలం 11 స్థానాలు మాత్రమే వైసీపీకి దక్కాయి. అందుకే ఎప్పటి నుండో స్పీకర్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో వస్తున్న ఆనవాయితీకి జగన్ తిలోదకాలు ఇస్తున్నట్లు భావిస్తున్నారు.
కాగా, స్పీకర్ పదవి కోసం ఒక్కటే నామినేషన్ రావడంతో అయ్యన్న ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది. అయ్యన్న పాత్రుడు ఇప్పటి వరకూ ఏడు సార్లు ఎమ్మెల్యేగా, ఒక సారి అనకాపల్లి ఎంపీగా, పలు శాఖలకు మంత్రిగా పని చేశారు.
YS Jagan: ఓటమితో అధైర్యపడవద్దు – క్యాడర్ కు తోడుగా నిలిచి భరోసా ఇవ్వండి: వైసీపీ నేతలకు జగన్ సూచన