(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి: జగన్మోహనరెడ్డి సర్కార్ దెబ్బ ఐఆర్ఎస్ అధికారి కృష్ణకిషోర్ విషయంలో బెడిసి కొట్టినా సీనియర్ ఐపిఎస్ అధికారి ఎబి వెంకటేశ్వరరావు విషయంలో సక్సెస్ అయ్యింది. చంద్రబాబు ప్రభుత్వంలో కీలక స్థానాల్లో పని చేసిన కృష్ణకిషోర్, ఏబి వెంకటేశ్వరరావులను వివిధ ఆరోపణలపై జగన్ ప్రభుత్వం సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే కృష్ణకిషోర్ తన సస్పెన్షన్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ సెంట్రల్ అప్పిలేట్ ట్రైబ్యూనల్ (క్యాట్)ను ఆశ్రయించగా ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టి ఆయన సస్పెన్షన్ చెల్లదని క్యాట్ పేర్కొన్నది.
ఇక ఎబి వెంకటేశ్వరరావు విషయం ప్రభుత్వ నిర్ణయాన్ని క్యాట్ సమర్ధించింది. సస్పెన్షన్పై ఆయన వేసిన పిటిషన్ను క్యాట్ కొట్టివేసింది. రాష్ట్ర ప్రభుత్వం వద్ద అప్పీలు చేసుకోవాలని ఈ మేరకు క్యాట్ సూచించింది. సస్పెన్షన్ రద్దు చేసేందుకు క్యాట్ నిరాకరించింది. ఎవి వెంకటేశ్వరరావు సస్పెన్షన్ను ఇప్పటికే కేంద్ర హోంశాఖ సమర్థించిన విషయం తెలిసిందే.
1989 బ్యాచ్ ఐపిఎస్ అధికారి అయిన ఎబి వెంకటేశ్వరరావు చంద్రబాబు హయాంలో ఇంటిలిజెన్స్ చీఫ్గా బాధ్యతలు నిర్వహించారు. ఎన్నికలకు ముందు ఎబివిపై నాటి ప్రతిపక్ష నాయకుడు, నేటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిలు తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. వారు కేంద్ర ఎన్నికల సంఘానికి చేసిన ఫిర్యాదుపై ఎన్నికల ముందు ఆయన్ను ఆ స్థానం నుంది ఎన్నికల సంఘం బదిలీ చేసింది. నాడు ఎబి వెంకటేశ్వరరావును ఎన్నికల సంఘం బదిలీ చేయడాన్ని ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు తప్పుబట్టారు. రాష్ట్రంలో జగన్మోహనరెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విధి నిర్వహణలో ఎబి వెంకటేశ్వరరావు పాల్పడిన అధికార దుర్వినియోగానికి సంబంధించి విచారణ జరిపింది. ఏడిజిపిగా పని చేసిన సమయంలో నిఘా పరికరాల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడినట్లు డీజిపి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. దీనిపై ఎబి వెంకటేశ్వరరావును సస్పెండ్ చేయగా తన సస్పెన్షన్ చట్ట విరుద్ధమనీ, రాజకీయ ఒత్తిడి కారణంగానే తనపై సస్పెన్షన్ వేటు వేశారని క్యాట్ను ఆశ్రయించగా అక్కడ ఆయనకు చుక్కెదురైంది.