ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని ఆశపడుతున్న వైసిపి శ్రేణులకు ఆ పార్టీ అధినేత జగన్ హఠాత్తుగా తీసుకునే నిర్ణయాలతో షాక్ లిస్తుంటారు. అలా జగన్ తీసుకునే నిర్ణయాల్లో వారికి ఆనందం కంటే కలవరం కలిగించే సందర్భాలే ఎక్కువ. అంతేకాదు కొన్ని సార్లు జగన్ తీసుకునే నిర్ణయాలు సెల్ఫ్ గోల్స్ గా పరిణమించిన సందర్భాలు కూడా ఉన్నాయి. పాత విషయాల సంగతి వదిలేస్తే జగన్ ఇటీవలికాలంలో నియోజక వర్గాల ఇన్ ఛార్జ్ లను మారుస్తూ తీసుకున్న నిర్ణయాలపై పార్టీ శ్రేణుల నుంచి సానుకూల స్పందన కంటే వ్యతిరేకతే ఎక్కువగా వస్తున్నట్లు కనిపిస్తున్న సంగతీ తెలిసిందే.
తమ పార్టీ అధినేత జగన్ సుదీర్ఘకాలంగా కొనసాగిస్తున్న పాదయాత్రను ఇటీవలే ముగించిన నేపథ్యంలో ఆయన రికార్డు స్థాయి రాజకీయ పాదయాత్ర ద్వారా తమ పార్టీకి మంచి మైలేజే తెచ్చిపెట్టారన్న వైసిపి శ్రేణుల ఆనందం…స్వల్ప వ్యవధిలోనే తీసుకున్న ఆయన తీసుకున్న ఒక నిర్ణయంతో కొండెక్కింది. దానికి తోడు మరో పరిణామం కూడా ఆ పార్టీ శ్రేణుల టెన్షన్ ను మరింత పెంచుతున్నట్లు తెలుస్తోంది.
అలా వైసిపిని కలవర పరుస్తున్న ఆ రెండు విషయాల్లో ఒకటి నవరత్నాల హామీలు కాగా మరొకటి కెసిఆర్ కి మద్దతు ప్రకటన. తమ పార్టీకి అధికారం సాధించిపెట్టే అంబులపొదిలోని ప్రధాన అస్త్రంగా జగన్ భావిస్తున్న నవరత్నాల హామీలను టిడిపి అధినేత చంద్రబాబు ఒక్కొక్కటిగా ముందే అమలు చేసేస్తుండటంతో పాటు రాజకీయ చాణుక్యంలో ఆరితేరిన ఆయన తెలివిగా ఆ నవరత్నాల హామీల్లోని పధకాలను అంతకుమించిన స్థాయిలో అమల్లోకి తెచ్చేస్తున్నారు. దీంతో వైసిపి కి పాజిటివ్ మైలేజ్ తెచ్చిన నవరత్నాలు అలా ఒక్కొక్కటిగా ప్రత్యర్థి పార్టీ చేత అమలుకాబడుతూ తమ పార్టీకి నిర్వీర్యం అయిపోతుండటంతో చంద్రబాబు అనుభవం ముందు జగన్ వ్యూహం మరోసారి ఫెయిల్ అయినట్లేనా?…అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
వైసిపి అధినేత జగన్ పార్టీ ప్లీనరీ సమావేశాల సందర్భంగా ప్రకటించిన నవ రత్నాల హామీలకు ప్రజల నుంచి మంచి స్పందనే అభించింది. దీంతో పథకాలే తమకి వచ్చే ఎన్నికల్లో ఓట్లు రాల్చే కల్పవృక్షాలుగా పరిణమిస్తాయని ఆ పార్టీ నేతలు ఆశపడ్డారు. దీంతో పాటు జగన్ కూడా తన పాదయాత్రలో ఈ నవరత్నాలకు విస్తృత ప్రచారం కల్పించడం వారి ఆశలను రెట్టింపుచేసింది. అయితే తాజాగా టిడిపి అధినేత,సిఎం చంద్రబాబు ఈ నవరత్నాల హామీల పథకాల్లో ఒక్కోదానిని అమలు చేస్తూ ఉండటం వైసిపిని ఖంగుతినిపించింది. ఇప్పటికే జగన్ హామీ ఇచ్చిన పెన్షన్లు రూ.1000 నుండి 2 వేలకు పెంపు అమల్లోకి తెచ్చేయగా, ఉచిత విద్యుత్ 9 గంటలకు పెంపు, రైతులకు పంట సాయం వంటివి జగన్ చెప్పినదానికన్నా మరింత పై స్థాయిలో అమలు చేసేలా ప్రణాళికలు సిద్దం చేస్తుండటం వైసిపిని మరింత ఆందోళనకు గురిచేస్తోంది.
ఇక వైసిపి శ్రేణులను మరింత కలవరపాటుకు గురిచేసిన మరో తాజా పరిణామం కెసిఆర్ ఫెడరల్ ఫ్రంట్ కు జగన్ మద్దతు ప్రకటన. తమ అధినేత జగన్ మరోసారి ఏకపక్షంగా తీసుకున్న ఈ నిర్ణయం వచ్చే ఎన్నికల్లో తమని దారుణంగా దెబ్బతీస్తుందేమో అనే అనుమానాలు ఆ పార్టీ శ్రేణుల్లో వ్యక్తం అవుతున్నాయి. పైగా వైసిపిని చావు దెబ్బ తీసే అవకాశం కోసం అనుక్షణం కాసుకొని ఉండే అధికార పార్టీ టిడిపి ఇప్పటికే జగన్ నిర్ణయాన్ని తారాస్థాయిలో చీల్చిచెండాడుతున్న సంగతి తెలిసిందే. ఆంధ్రా ద్రోహులతో జగన్ చేతులు కలిపారంటూ ఆ పార్టీ విస్తృతంగా ప్రచారం చేస్తోంది. పైగా టిడిపి ఈ ప్రచారానికి కొన్ని ప్రధాన మీడియా సంస్థల నుంచి ఎప్పటిలాగే చక్కటి సహకారం అందుతోంది. తమని శత్రువులుగా పరిగణించే కెసిఆర్-జగన్ లను ఒకే అంశం ద్వారా డిఫెన్స్ లోకి నెట్టే అవకాశం లభించడంతో ఆయా మీడియా సంస్థలు కూడా ఈ అంశానికి మరింత ప్రాధాన్యత ఇస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. దీంతో అటు నవరత్నాల అంశం…ఇటు ఈ కెసిఆర్-జగన్ ల మైత్రిలకు వ్యతిరేకంగా ప్రచారంతో సహజంగానే వైసిపి శ్రేణుల్లో ఆందోళన మరింత పెరిగిపోతున్నట్లు తెలుస్తోంది.