Amaravati Farmers Protest: అమరావతి రాజధాని ప్రాంత గ్రామాల్లో పోలీసులు ఆంక్షలు విధించారు. అమరావతి రైతుల ఉద్యమానికి నేటితో 600 రోజులు పూర్తి అయిన సందర్భంగా అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో నిరసనలకు పిలుపునిచ్చారు. న్యాయస్థానం టు దేవస్థానం పేరుతో హైకోర్టు నుండి మంగళగిరి లక్ష్మీనర్శింహస్వామి ఆలయం వరకూ రాజధాని ప్రాంత రైతులు, మహిళలు ర్యాలీగా వెళ్లాలని నిర్ణయించారు. అయితే ఉద్యమకారులు చేపట్టిన ఈ నిరసన ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించారు.
అమరావతి ప్రాంతంలో భారీగా భద్రతా బలగాలను మోహరించారు. పలు ప్రాంతాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి గుర్తింపు కార్డులు ఉన్న స్థానికులను మాత్రమే అనుమతి ఇస్తున్నారు. రాజధాని గ్రామాల్లోకి మీడియా ప్రతినిధులను అనుమతించకుండా పెదపరిమి వద్దే నిలుపుదల చేశారు. మరో వైపు విజయవాడ – అమరావతి మార్గంలోనూ అడుగడుగునా ఆంక్షలు అమలు చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీ సహా కరకట్ట వెంట పోలీసులు మోహరించారు. కరకట్టపై నాలుగు ప్రదేశాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. వాహనాలను తనిఖీ చేసి వదులుతున్నారు. మంగళగిరి లక్ష్మీనర్శింహస్వామి ఆలయం వద్ద కూడా భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అమరావతి రైతులు ర్యాలీగా వస్తారన్న సమాచారంతో ఆలయం చుట్టూ ఇనుప కంచె ఏర్పాటు చేసి పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.
అసెంబ్లీలో సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి మూడు రాజధానుల ప్రకటన చేసిన నాటి నుండి అమరావతి ప్రాంతంలో భూములు ఇచ్చిన రైతాంగం నిరసన కార్యక్రమాలను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం మూడు రాజధానుల అంశం హైకోర్టు విచారణలో ఉంది. విశాఖలో పరిపాలనా రాజధాని, కర్నూలులో న్యాయరాజధాని, అమరావతిలో శాసన రాజధాని ఏర్పాటు చేయాలన్న కృతనిశ్చయంతో వైసీపీ ప్రభుత్వం ఉంది. ఆ మేరకు ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నది.