AP Cabinet : ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ కేబినెట్లో నిర్ణయాలు తీసుకున్నామని రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అధ్యక్షతన మంగళవారం జరిగిన కేబినెట్ పలు కీలక నిర్ణయాలను ఆమోదించింది. కేబినెట్ భేటీ అనంతరం వివరాలను మంత్రి నాని మీడియాకు తెలియజేశారు. క్యాలెండర్ ప్రకారం సంక్షేమ పథకాలు అమలు చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. నవరత్నాల ద్వారా దాదాపు 12 కోట్ల మందికి సంక్షేమ ఫలాలు అందించాలని తీర్మానించినట్లు తెలిపారు.
అగ్రవర్ణ పేద మహిళలకు ఏటా రూ.15వేలు
అగ్రవర్ణాలలోని పేద మహిళల ఆర్థికంగా చేయూతనందించేందుకు కొత్త పథకాన్ని ప్రభుత్వం తీసుకువచ్చిందన్నారు. వైఎస్ఆర్ చేయూత కార్యక్రమాన్ని ఈబీసీ వర్గానికి వర్తింపజేస్తూ వచ్చే ఏడాది నుండి అమలు చేసేందుకు మంత్రిమండలి నిర్ణయం తీసుకుందన్నారు. ఈ పథకం ద్వారా 45 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల లోపు ఈబీసీ మహిళలకు ఏటా రూ.15వేల చొప్పున మూడేళ్లు చెల్లించేందుకు కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నామని మంత్రి తెలిపారు.
AP Cabinet : నెలవారీ సంక్షేమ పథకాలు
రాష్ట్రంలో ఇప్పటి వరకూ అందజేసిన 23 రకాల సంక్షేమ పథకాలను ఏప్రిల్ నుండి 2022 జనవరి వరకు అమలు చేసేందుకు సంక్షేమ క్యాలెండర్ రూపొందించామన్నారు. సుమారు 5.60కోట్ల మందికి సంక్షేమ పథకాలు నెలవారిగా అందజేసేందుకు నిర్దేశిత మాసాన్ని కేటాయించామన్నారు. ఇందు కోసం క్యాలెండర్, బడ్జెట్ కూడా ఆమోదించామని చెప్పారు.
YS Jagan : నెల వారి సంక్షేమ క్యాలెండర్
ఏప్రిల్ నెలలో వసతి దీవెన, జూలైలో సంపూర్ణ ఫీజు రీయింబర్స్ మెంట్, జూన్ లో జగనన్న విద్యాకానుక, ఏప్రిల్ లో రైతులకు వడ్డీ లేని రుణాలు, డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు, మే నెలలో ఖరీఫ్ కు సంబంధించి రైతు భరోసా కింద 54 లక్షల మందికి పెట్టుబడి సాయం, మత్స్యకార భరోసా పథకం కింద 19 వేల మంది మత్స్యకారులకు ఆర్థిక సహాయం, జూన్ లో వైఎస్ఆర్ చేయూత, జూలైలో వైఎస్ఆర్ వాహన మిత్ర, కాపునేస్తం పథకం, ఆగస్టులో రైతులకు వడ్డీలేని రుణాలు, ఎంఎస్ఎంఈ కింద పారిశ్రామిక వేత్తలకు, పరిశ్రమలకు సబ్సిడీ రుణాలు, నేతన్న నేస్తం, ఆగ్రిగోల్డ్ బాధితులకు పరిహారం అందజేత,
సెప్టెంబర్ లో వైఎస్ఆర్ ఆసరా, అక్టోబర్ లో జగనన్న చేదోడు, నవంబర్ నెలలో ఆర్థికంగా వెనుకబడిన మహిళలకు వైఎస్ఆర్ చేయూత సాయం, జనవరిలో అమ్మఒడి పథకం అమలు చేసేందుకు క్యాలెండర్ ఆమోదిస్తూ తీర్మానం చేయడం జరిగిందన్నారు. దాదాపు 8 కోట్ల మందికి లబ్దిచేకూర్చేలా సంక్షేమ పథకాలు రూపొందించామని చెప్పారు. ఇవి కాకుండా నెలవారీగా రేషన్ పంపిణీ, ఆరోగ్యశ్ర, ఆరోగ్య ఆసరా, ఫించన్ పంపిణీ, సంపూర్ణ పోషణ పథకాలు కూడా అమలు చేసేందుకు మంత్రిమండలిలో నిర్ణయం తీసుకున్నామని మంత్రి నాని తెలిపారు. దాదాపు 12 కోట్ల మందికి సంక్షేమ పథకాలు అందజేసేందుకు క్యాలెండర్ రూపొందించామన్నారు.
టిడ్కో పథకం కింద అపార్ట్మెంట్ కోసం ధరఖాస్తు చేసుకున్న లబ్దిదారులకు 1.43 లక్షల మందికి ఒక్క రూపాయికే ఫ్లాట్ కేటాయిస్తామన్నారు. రూ.50వేలు ముందు చెల్లించిన వాటా భారాన్ని ప్రభుత్వం భరిస్తూ రూ.110కోట్లు చెల్లిస్తోందన్నారు. లక్ష రూపాయలు చెల్లించాల్సిన వాటాను ప్రభుత్వం రూ.371 కోట్లు భారం భరిస్తూ మంత్రి మండలి లో ఆమోదం తెలిపిందన్నారు.
2021 ఏప్రిల్ నుండి కొత్తగా వచ్చిన ప్రైవేటు లే అవుట్ ప్రకారం 5 శాతం భూమి పేదలకు కేటాయించేలా తీర్మానం చేశామనీ, ఆ భూమిని ప్రభుత్వానికి బదలాయించాలన్నారు. లే అవుట్ కట్టడి చేసేందుకు చర్యలు తీసుకున్నామని చెప్పారు. కుళాయి కనెక్షన్లు కూడా ఇకపై అనధికారికంగా ఇవ్వకూడదని కేబినెట్ లో తీర్మానం చేయడం జరిగిందన్నారు.
రైతులకు అవసరమైన ప్రతిదీ వారి గ్రామాల్లోనే అందించేందుకు రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశామనీ, రైతులకు అవసరమైన విత్తనం నుండి పంట అమ్ముకునే వరకూ ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందన్నారు. రైతు పొలం వద్దే పంట కొనుగోలు చేస్తామని తెలిపారు. గోడౌన్ లు, కోల్డు స్టోరేజీల ఏర్పాటునకు నిధులు మంజూరు చేస్తూ కేబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పారు.
కడప జిల్లాలో వైఎస్ఆర్ స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి భాగస్వామ్య సంస్థతో కలిపి నిర్మించేందుకు ఎస్బీఐ ద్వారా పారదర్శకమైన పద్ధతిలో ఎంపికను ఆమోదిస్తూ కేబినెట్ తీర్మానం చేసిందన్నారు. స్టీల్ ప్లాంట్ నిర్మాణం తొలి దశలో రూ.10,080 కోట్లు, రెండవ దశలో రూ.6వేల కోట్లు పెట్టుబడి పెట్టాలని కేబినెట్ నిర్ణయం తీసుకుందని తెలిపారు.
కడప జిల్లా జమ్మలమడుగు మండలంలో 3148.68 ఎకరాల భూమిని ఏపి హైగిడ్ కు కేటాయించి, ఈ స్థలంలో వైఎస్ఆర్ స్టీల్ ప్లాంట్ నిర్మించాలని, అంబాపురంలో 93.99 ఎకరాల్లో ఏపిఐఐసీ ఆధ్వర్యంలో మెగా ఇండస్ట్రీయల్ పార్క్ కోసం భూమి కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుందని మంత్రి నాని చెప్పారు. సికె దిన్నె మండలంలో 98.58 ఎకరాల్లో మెగా ఇండస్ట్రీయల్ పార్క్ నిర్మించేందుకు భూమి కేటాయిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. తూర్పు గోదావరి జిల్లా కోనంగి గ్రామంలో 160.04 ఎకరాలు ఏపి మ్యారిటైం బోర్డుకు కేటాయిస్తూ కేబినెట్ ఆమోదం తెలిపినట్లు మంత్రి నాని తెలిపారు.
కాకినాడ సెక్ కోసం భూములు ఇచ్చిన రైతులకు 2,180 ఎకరాలు తిరిగి ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు.
చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరు మండలం ఎదురుకుప్పం మండలం లో రెండు కొత్త అగ్నిమాపక కేంద్రాలు, జమ్మలమడుగు మండలం ముద్దునూరులో అగ్నిమాపక కేంద్రం నిర్మాణానికి 12 మంది సిబ్బందిని నియమించేందుకు మంత్రిమండలి ఆమోదం తెలిపిందని చెప్పారు.