AP CID Case : ఏపి సీఐడీ కేసు ఎదుర్కొంటున్న టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు హైకోర్టులో కొంత ఊరట లభించింది. ఈ నెల 7వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి పై మాజీ మంత్రి దేవినేని ఉమా తప్పుడు ఆరోపణలు చేస్తూ మార్ఫింగ్ వీడియో ప్రదర్శించారన్న అభియోగంపై ఏపి సీఐడీ కేసు నమోదు చేసింది. నారాయణ రెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు ఈ నెల 10వ తేదీ ఉమామహేశ్వరరావుపై సెక్షన్ 464, 465, 468, 469, 470, 471, 505, 120 బీ కింద ఏపి సీఐడి కేసు నమోదు చేసింది. తొలుత ఈ నెల 15న విచారణకు రావాలని ఉమాకు సీఐడీ నోటీసు జారీ చేసింది. నోటీసు అందజేసిన రోజే విచారణకు హజరు కావాలని పేర్కొనడం ఏమిటంటూ ప్రశ్నించిన ఉమా తనకు పది రోజులు సమయం కావలని కోరారు. సీబీఐ మరల 19వ తేదీన హజరు కావాలని నోటీసు ఇచ్చారు. ఈ నోటీసును గొల్లపూడిలోని ఆయన నివాసంలో అంటించారు.
రెండవ నోటీసుకు ఉమా స్పందించకపోవడంతో సీఐడి ఆధికారులు రెండు రోజుల క్రితం గొల్లపూడిలోని ఆయన నివాసానికి వెళ్లారు. ఆ సమయంలో ఉమా ఇంట్లో లేకపోవడంతో సీఐడి అధికారులు వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో తనపై అక్రమంగా కేసు నమోదు చేసి సీఐడీ అరెస్టు చేయాలని ప్రయత్నిస్తున్నదనీ, సీఐడీ నోటీసులను రద్దు చేయాలని కోరుతూ ఉమా హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు ఉమాకు 41 ఏ కింద రక్షణ కల్పించాలని పేర్కొంది. మే 7వ తేదీ వరకూ ఎలాంటి చర్యలు చేపట్టవద్దని సూచించింది. ఈ నెల 21న ఉదయం 11 గంటలకు మంగళగిరి సీఐడీ ఆఫీసుకు విచారణకు హజరుకావాలని ఊమాకు ఆదేశించింది. విచారణను మే 7వ తేదీకి వాయిదా వేసింది.
వైఎస్ జగన్మోహనరెడ్డి సర్కార్ ఇంతకు ముందు ఇఎస్ఐ పరికరాల కొనుగోళ్ల కేసులో మాజీ మంత్రి, ఎమ్మెల్యే కింజారపు అచ్చెన్నాయుడు, ఆ తరువాత హత్య కేసులో మాజీ మంత్రి కొల్లు రవీంద్రలను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వంపైనా, సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డిపైనా తరచు తీవ్ర స్థాయి విమర్శలు, ఆరోపణలు చేస్తున్న దేవినేని ఉమామహేశ్వరరావు ప్రభుత్వ నెక్ట్స్ టార్గెట్ అంటూ ప్రచారం జరుగుతోంది. ఈ తరుణంలోనే ఉమాపై సీఐడి కేసు నమోదు చేయడం, విచారణకు రావాలంటూ వెంటవెంట నోటీసులు ఇవ్వడం, ఆయన ఇంటికి సీఐడీ అధికారులు వెల్లడంతో అరెస్టుకు సిద్ధం అవుతున్నారన్న ప్రచారం జరిగింది. అయితే ఉమా హైకోర్టును ఆశ్రయించడంతో మే 7 తేదీ వరకూ సీఐడీ తదుపరి చర్యలకు బ్రేక్ పడింది. అయితే హైకోర్టు మాత్రం ఉమాకు సీఐడి విచారణకు వెళ్లాల్సిందేనని పేర్కొంది.