AP Corona Cases: ఏపిలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో వైరస్ కట్టడికి పగటి కర్ఫ్యూ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేఫథ్యంలో కరోనా కేసుల నమోదు గణాంకాలను పరిశీలిస్తే కొత్త కేసులు కొంత వరకు తగ్గినట్లు స్పష్టంగా కనబడుతోంది. గడచిన 24 గంటల్లో 1,00,424 మందికి పరీక్షలు చేయగా 17,188 మంది కరోనా బారిన పడినట్లు గుర్తించారు. అంతకు ముందు 24 గంటల వ్యవధిలో 1,10,147 మందికి పరీక్షలు జరపగా 21,954 మందికి పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. అంటే సుమారు 20శాతం కేసులు తగ్గినట్లు కనబడుతోంది. గత మూడు రోజులుగా 20వేలకు పైగా కేసులు వెలుగు చూస్తుండగా రాష్ట్రంలో కర్ఫ్యూ అమలు చేసిన సుమారు 4,800 కేసులు తగ్గాయి.
రాస్ట్రంలో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 2260 కొత్త కేసులు వెలుగు చూడగా ఆ తరువాత స్థానాల్లో విశాఖపట్నం (1868), ఈస్ట్ గోదావరి జిల్లా (1823) లు ఉన్నాయి. అత్యల్పంగా ప్రకాశం జిల్లాలో 385 కేసులు నమోదు అయ్యాయి. 24 గంటల వ్యవధిలో 12,749 మంది చికిత్స అనంతరం పూర్తిగా కోలుకుని ఆసుపత్రుల నుండి డిశ్చార్జ్ అయ్యారు. మరణాల విషయానికి వస్తే గడచిన 24 గంటల్లో విజయనగరం జిల్లాలో 11 మంది, విశాఖపట్నం జిల్లాలో పది మంది, తూర్పు గోదావరి జిల్లాలో 8మంది, చిత్తూరు జిల్లాలో ఏడుగురు, కృష్ణా, గుంటూరు జిల్లాలలో ఆరుగురు చొప్పున, కర్నూలు, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాలో అయిదుగురు చొప్పున, నెల్లూరు, శ్రీకాకుళం జిల్లాలలో నలుగురు చొప్పున, అనంతపురం జిల్లాలో ఇద్దరు కరోనాతో మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 1,86,695 యాక్టివ్ కేసులు ఉన్నాయి.