ఏపి ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. స్వల్ప సంఖ్యలో ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి జగన్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సీఎం వైఎస్ జగన్ అనుమతితో రాష్ట్ర ప్రాధమిక విద్యాశాఖ లిమిటెడ్ డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. వాస్తవానికి డీఎస్సీ ఎప్పుడు విడుదల అయినా వేల సంఖ్యలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ జరుగుతుంటుంది. మెగా డిఎస్సీ కోసం లక్షలాది మంది ఉద్యోగార్ధులు ఎదురుచూస్తున్నారు. అయితే ఏపి సర్కార్ మంగళవారం విడుదల చేసిన లిమిటెడ్ నోటిఫికేషన్ ద్వారా కేవలం 502 ఉపాధ్యాయ పోస్టులు మాత్రమే భర్తీ చేయనున్నారు.
జిల్లా పరిషత్, మండల పరిషత్ పాఠశాలల్లో 199 పోస్టులు, మోడల్ స్కూల్ లో 207 పోస్టులు, మున్సిపల్ స్కూళ్లలో 15 పోస్టులు, స్పెషల్ ఎడ్యుకేషన్ విభాగంలో 81 పోస్టులు ఉన్నాయి. స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీ, మ్యూజిక్ ఉపాద్యాయులు, ఆర్ట్ ఉపాధ్యాయులు, స్పెషల్ ఎడ్యుకేషన్ (స్కూల్ అసిస్టెంట్స్), ఏపి మోడల్ స్కూల్స్, బీసీ సంక్షేమ పాఠశాలల్లో పీజీటీ, టీజీటీల నియామకాలు జరగనున్నాయి.
డీఎస్సీలో టెట్ మార్కులకు 20 శాతం వెయిటేజీ కేటాయించారు. ఫీజు చెల్లింపు గడువు ఈ రోజు (23వ తేదీ) నుండి సెప్టెంబర్ 17 వరకూ ఉంటుందని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఈ నెల 25వ తేదీ నుండి సెప్టెంబర్ 18 వరకూ ధరఖాస్తులు స్వీకరించనున్నారు. అక్టోబర్ 23వ తేదీ పరీక్ష నిర్వహించనున్నారు. నవంబర్ 4న ఫలితాలు విడుదల చేయనున్నారు. పరీక్షకు సంబంధించి పూర్తి వివరాలను ఈ రోజు నుండి వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచినట్లు వెల్లడించింది.