AP Governor: ఏపి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ మళ్లీ అస్వస్థతకు గురైయ్యారు. దీంతో ఆయనను ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కు తరలించారు. ఈ నెల 15న ఆయన కరోనా బారిన పడ్డారు. కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో కావడంతో 17వ తేదీ హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చేరారు. ఈ నెల 20, 22 తేదీల్లో పరీక్ష నిర్వహించగా కోవిడ్ నెగిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఈ నెల 23వ తేదీన ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. ఆయన ఆరోగ్యం కుదుట పడటంతో విజయవాడ లోని రాజ్ భవన్ కు చేరుకున్నారు. ఆదివారం రాత్రి మరల ఆయన అస్వస్థతకు గురి కావడంతో ప్రత్యేక విమానంలో మరో సారి హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన వారం రోజుల్లోనే మళ్లీ అస్వస్థతకు గురైయ్యారు. పోస్ట్ కోవిడ్ సమస్యలతో బాధపడుతున్నట్లు వైద్యులు గుర్తించారు. గవర్నర్ తో పాటు ఆయన సతీమణి కూడా హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. అయితే గవర్నర్ ఆరోగ్య పరిస్థితిపై ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదనీ, పోస్ట్ కోవిడ్ సమస్యల కారణంగానే ఆసుపత్రికి వెళ్లినట్లు రాజ్ భవన్ వర్గాలు చెబుతున్నాయి.
ఒడిశాకు చెందిన బిశ్వభూషణ్ హరిచందన్ (88) జూలై 2019 నుండి ఏపి గవర్నర్ గా వ్యవహరిస్తున్నారు. 1971లో జనసంఘ్ లో చేరిన బిశ్వభూషణ్ ..అయిదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2004 నుండి 09 మద్య ఒడిశా మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. బిశ్వభూషణ్ రాజకీయ నేతగానే కాకుండానే న్యాయవాదిగా, రచయితగా గుర్తింపు పొందారు.