AP Governor: ఏపిలో ఉద్యోగులు పీఆర్సీ సమస్యపై ప్రభుత్వంపై పోరుబాట పట్టిన విషయం తెలిసిందే. పీఆర్సీ సాధన సమితిగా ఏర్పడిన ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు ఇప్పటికే సమ్మె నోటీసు అందించారు. ఈ నేపథ్యంలో బుధవారం విజయవాడ ఇందిరా గాంధీ స్టేడియంలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఉద్యోగుల అంశంపైనా మాట్లాడారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం వైఎస్ జగన్ పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అంతకు ముందు పోలీసు దళాల నుండి ఆయన గౌరవవందనం స్వీకరించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి శకటాల ప్రదర్శన జరిగింది. మొత్తం శాఖలకు సంబంధించి శకటాలను ప్రదర్శించారు.
AP Governor: ఉద్యోగులకు, ప్రభుత్వానికి మధ్య మనస్పర్ధలు ఉండకూడదు
జాతీయ పతకాన్ని ఆవిష్కరించిన అనంతరం గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ మాట్లాడుతూ..రాష్ట్రంలో కరోనా, విభజన సమస్యలు ఉన్నా..ఉన్నంతలో మంచి పీఆర్సీ ఇవ్వడం జరిగిందన్నారు. 23 శాతం ఫిట్మెంట్ ఇస్తున్నామన్నారు. 62 సంవత్సరాల రిటైర్మెంట్ వయసు పెంచిన ఏకైక ప్రభుత్వం తమదేనన్నారు. గ్రాట్యూటీని రూ.4లక్షల మేర పెంచినట్లు వెల్లడించారు. విభజన వల్ల ఇబ్బందులు వచ్చినా ఉద్యోగులు, పేద ప్రజల సంక్షేమం చూస్తున్నామన్నారు. ఉద్యోగులకు, ప్రభుత్వానికి మధ్య మనస్పర్ధలు ఉండకూడదనీ, అందరూ కలిసి రాష్ట్రాభివృద్ధికి కృషి చేయాలని గవర్నర్ పిలుపునిచ్చారు. అన్ని వర్గాలకు మేలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాలు అమలు చేస్తోందని చెప్పారు. ప్రతి పేదవాడి సొంతింటి కల నెరవేరుస్తున్నామన్నారు. రైతు భరోసా కేంద్రాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయనీ, వ్యవసాయ రంగంలో అగ్రగామిగా నిలిచామని గవర్నర్ వివరించారు. అన్ని వర్గాల అభివృద్ధే లక్ష్యంగా పాలన జరుగుతోందన్నారు.
Read More: AP New Districts: ఏపిలో గెజిట్ ప్రకారం కొత్తగా ఏర్పాటైన జిల్లాలు ఇవే..
AP Governor: ఉగాది నుండి కొత్త జిల్లాల్లో పాలన
సమీకృత అభివృద్ధి కోసం, పార సేవలు మరింత మెరుగ్గా అందించేందుకు కొత్తగా 13 జిల్లాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. ఉగాది నాటికి కొత్త జిల్లాలు ఏర్పడుతాయన్నారు. రెండు జిల్లాలు ప్రత్యేకంగా గిరిజన ప్రాంత జిల్లాలుగా ఉంటాయన్నారు.