AP Govt: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్య పరిష్కారానికి ప్రభుత్వం సీరియస్గా కసరత్తు చేస్తోంది. తొలుత పీఆర్సీ, డీఏ తదితర సమస్యల పరిష్కారానికై ప్రభుత్వంపై దూకుడుగా వ్యవహరిస్తూ ఆందోళన బాట పట్టిన ఉద్యోగ సంఘాలు పది రోజుల వ్యవధిలోనే మెత్తపడ్డాయి. ప్రభుత్వ పెద్దలు రాష్ట్ర ప్రభుత్వ ఆర్ధిక ఇబ్బందులను వివరిస్తూ మన మంతా ఒక కుటుంబం, నెమ్మదిగా అన్ని సమస్యలు పరిష్కరించుకుందాం, అవసరమైతే వ్రాతపూర్వక హామీ ఇస్తామని చెప్పడంతో ఉద్యమాన్ని వాయిదా వేశారు. మొన్న, నిన్న ఉద్యోగ సంఘాల నేతలతో ప్రభుత్వ పెద్దలు సుదీర్ఘంగా జరిపిన చర్చలు ఫలప్రదం అయ్యాయి.
AP Govt: ప్రభుత్వ సానుకూల స్పందన
తొలుత ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేసినా ప్రభుత్వ పెద్దలు ఆ వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకోలేదు. సమస్యల పరిష్కారంలో జరిగిన ఆలస్యం, ఉద్యోగుల్లో ఓ టెంపో రావడానికి అలా వ్యాఖ్యలు చేసి ఉంటారని లైట్ గా తీసుకున్నారు. సామరస్య పూర్వక ధోరణలోనే ప్రభుత్వం వ్యవహరించడంతో ఉద్యోగ సంఘాల నేతలు మెత్తబడ్డారు. మొన్న ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఉద్యోగ సంఘాల నేతలతో దాదాపు ఆరు గంటలకుపైగా చర్చించారు. ఏకాభిప్రాయం కుదరకపోవడంతో మరో సారి సమావేశం అవ్వాలని నిర్ణయించుకుని అర్ధాంతరంగా సమావేశాన్ని ముగించారు. ఉద్యోగ సంఘాలు చెప్పిన అంశాలపై నిన్న సీఎం వైఎస్ జగన్ ను సజ్జల, బుగ్గన కలిసి వివరించారు. సాయంత్రం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సమీర్ శర్మ, మంత్రి బుగ్గన ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశమైయ్యారు.
ఈ సమావేశంలో ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చింది. దీంతో ఉద్యోగు సంఘాల నేతలు తమ ఆందోళనను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. బుధవారం పీఆర్సీ, డీఏ తదితర అంశాలపై ప్రభుత్వం నుండి ప్రకటన వెలువడుతుందని చెప్పారు. ఈ నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్ తో నేడు మరో సారి సజ్జల, బుగ్గన భేటీ అయ్యారు. ఉద్యోగులు ఇచ్చిన డిమాండ్లపై నిన్న ఆయా సంఘాలతో జరిగిన చర్చల సారాంశాన్ని సీఎంకు సజ్జల, బుగ్గన వివరించినట్లు సమాచారం. సీఎంతో సమావేశం అనంతరం ఉద్యోగ సంఘాలతో సజ్జల, బుగ్గన మరో సారి భేటీ కానున్నారు.