AP High Court: ఏపి రాజధాని కేసులకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై విచారణ వాయిదా పడింది. విచారణను జనవరి 28కి వాయిదా వేస్తున్న హైకోర్టు పేర్కొంది. ఆ రోజు నుండి పూర్తి స్థాయి వాదనలు వింటామని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశాంత్ కుమార్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. రైతుల తరపున సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది శ్యాం దివాన్..పిటిషన్ లపై విచారణను కొనసాగించాల్సిందేనని కోర్టును కోరారు. ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ అమలు చేయాల్సిందేని అన్నారు. విచారణ నేపథ్యంలోనే కొన్ని సంస్థలను బయటకు తరలిస్తున్నారని రైతుల తరపు మరో న్యాయవాది ఉన్నం మురళీధర్ కోర్టుకు తెలిపారు. సెలక్ట్ కమిటీ ఆమోదం లేకుండానే బిల్లులను ఆమోదించినట్లు పేర్కొన్నారనీ ఇది రాజ్యాంగ విరుద్దమని జంద్యాల రవిశంకర్ వాదించారు.
AP High Court: ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయాలి
సీఆర్డీఏ రద్దు, పాలనా వికేంద్రీకరణ చట్టాలను ప్రభుత్వం ఉపసంహరించుకున్న నేపథ్యంలో పిటిషనల్లలో ఇంకా కొనసాగాల్సిన అంశాలు ఏమున్నాయనే వివరాలను పది రోజుల్లోగా నోట్ దాఖలు చేయాలని పిటిషనర్ల తరపు న్యాయవాదులను కోర్టు ఆదేశించింది. రైతుల తరపు న్యాయవాదులు నోట్ సమర్పించిన తరువాత ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. కేసు విచారణను జనవరి 28వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు తెలిపింది.
మూడు రాజధానుల కేసులు హైకోర్టు విచారణ కొనసాగుతున్న నేపథ్యంలోనే ప్రభుత్వం సీఆర్డీఏ రద్దు, పరిపాలనా వికేంద్రీకరణ బిల్లులను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లులను ఉపసంహరించుకున్నట్లు ఓ పక్క ప్రకటిస్తూనే త్వరలో పరిపాలనా వికేంద్రీకరణకు సంబంధించి మెరుగైన బిల్లు తీసుకువస్తామని వెల్లడించింది.