టీడీపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి కళా వెంకట్రావుకు హైకోర్టులో ఊరట లభించింది. కళా వెంకట్రావుపై నమోదు అయిన కేసులో తదుపరి విచారణ వచ్చే వరకూ ఏ విధమైన బలవంతపు చర్యలు చేపట్టవద్దంటూ పోలీసులకు హైకోర్టు ఆదేశించింది.
విజయనగరం జిల్లా రామతీర్థం వద్ద ఇటీవల జరిగిన ఘటనలో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కారుపై దాడి చేసి అద్దాలు పగలగొట్టారన్న ఆరోపణతో చంద్రబాబు, అచ్చెన్నాయుడు, కళా వెంకట్రావు తదితరులపై కేసు నమోదు అయ్యింది. దీంతో తనపై నమోదు అయిన కేసు విషయంలో కళా వెంకట్రావు హైకోర్టును ఆశ్రయించారు. మూడు రోజుల క్రితం రాత్రి సమయంలో విజయనగరం జిల్లా నెర్లిమర్ల పోలీసులు శ్రీకాకళం రాజాం వెళ్లి కళా వెంకట్రావును అరెస్టు చేసి అనంతరం విడుదల చేశారు. ఈ నేపథ్యంలో తనపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశించాలని కోరుతూ కళా వెంకట్రావు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం తదుపరి విచారణ వరకూ ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ ఆదేశించింది.