పదవ తరగతి ప్రశ్నా పత్రాల లీకేజీ కేసులో టీడీపీ నేత, మాజీ మంత్రి నారాయణకు హైకోర్టులో బిగ్ షాక్ తగిలింది. కేసు పూర్వాపరాల ఆధారంగా తిరిగి విచారణ జరపాలని చిత్తూరు సెషన్స్ కోర్టునకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి నారాయణ బెయిల్ ను రద్దు చేస్తూ అక్టోబర్ 31న చిత్తూరు జిల్లా సెషన్స్ కోర్టు తీర్పు ఇచ్చింది. నవంబర్ 30వ తేదీలోగా కోర్టుకు హజరుకావాలని ఆదేశించింది. చిత్తూరు జిల్లా సెన్షన్స్ కోర్టు ఆదేశాలను నారాయణ హైకోర్టులో సవాల్ చేశారు. తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని క్వాష్ పిటిషన్ లో కోరారు. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు తీర్పును రిజర్వు చేస్తూ చిత్తూరు కోర్టు ఇచ్చిన అరెస్టు రద్దు ఆదేశాలను పక్కన బెట్టింది. దీనిపై ప్రభుత్వం హైకోర్టులో రివిజన్ పిటిషన్ దాఖలు చేసింది. విచారణ సందర్భంలో నారాయణ తరపు న్యాయవాది రివిజన్ పిటిషన్ కు విచారణ అర్హత లేదని వాదనలు వినిపించారు. పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలను తోసిపుచ్చిన హైకోర్టు కేసు పూర్వాపరాల ఆధారంగా తిరిగి విచారణ జరపాలని చిత్తూరు సెషన్స్ కోర్టునకు ఆదేశించింది.
విషయంలోకి వెళితే.. ఈ ఏడాది పదవ తరగతి పరీక్షల నిర్వహణ సమయంలో పలు చోట్ల ప్రశ్నా పత్రాలు లీక్ కావడం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలాన్ని రేపింది. ప్రశ్నాపత్రాల లీక్ పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా, నారాయణ విద్యాసంస్థల్లో పని చేసే ఓ ఉపాధ్యాయుడే లీక్ చేసినట్లుగా కనుగొన్నారు. పలువురు ఉపాధ్యాయులను అరెస్టు చేసిన తర్వాత వారిని విచారించిన అనంతరం నారాయణ విద్యాసంస్థల అధినేత నారాయణను అదుపులోకి తీసుకుని చిత్తూరు కోర్టులో హజరుపర్చారు. అయితే నారాయణ తరపు న్యాయవాదులు ఆయన ప్రస్తుతం నారాయణ విద్యాసంస్థ బాధ్యతలు చూడటం లేదని, నారాయణ చైర్మన్ పదవికి గతంలోనే రాజీనామా చేసారని కోర్టుకు తెలియజేస్తూ అందుకు సంబంధించిన పత్రాలను సమర్పించారు. దీంతో కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. అయితే నారాయణకు బెయిల్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ చిత్తూరు ఒన్ టౌన్ పోలీసులు చిత్తూరు సెషన్స్ కోర్టులో సవాల్ చేశారు. పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు ఆయనకు ఇచ్చిన బెయిల్ ను రద్దు చేసింది.