AP high court : ఏపిలో పంచాయతీ ఎన్నికలపై దాఖలైన పిటిషన్ లను హైకోర్టు కొట్టేసింది. 2021 ఓటర్ల జాబితా ప్రకారం ఎన్నికలు జరగాల్సి ఉండగా 2019 ఓటర్ల జాబితాతో ఎన్నికలు నిర్వహిస్తున్నారనీ, ఈ కారణంగా పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్ లపై హైకోర్టు ధర్మాసనం నేడు విచారణ జరిపింది. నామినేషన్ లు దాఖలు చేసిన ప్రారంభం అయిన తరువాత కోర్టులు జోక్యం చేసుకోవని ఎస్ఈసీ తరపు న్యాయవాది తెలిపారు. 2021 ఓటర్ల జాబితా అందుబాటులో లేకపోవడం వల్ల 2019 ఓటర్ల జాబితాను పరిగణలోకి తీసుకున్నామని ఎస్ఈసీ న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. ఈ దశలో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేస్తూ హైకోర్టు పిటిషన్లను కొట్టివేసింది.
అర్హులకు ఓటు హక్కు అవకాశం కల్పించకుండా పంచాయతీ ఎన్నికలు నిర్వహించడం రాజ్యాంగ విరుద్దమంటూ పిటిషన్ లు దాఖలు అయ్యాయి. 2019 ఓటరు జాబితాతో ఎన్నికలు నిర్వహించడం వల్ల 18 ఏళ్లు నిండిన 3.6లక్షల మంది యువ ఓటర్లు ఓటు హక్కు కోల్పోతారని కోర్టుకు విన్నవించారు. అయితే ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అయిన నేపథ్యంలో హైకోర్టు కేసులను కొట్టేసింది.