తెలుగు రాష్ట్రాల్లో మావోయిస్టుల ఉనికి చాలా వరకు తుడిచిపెట్టుకుపోయింది అనుకుంటున్న తరుణం లో నిషేదిత విప్లవ సంస్థ నుండి ఏపిలోని ఓ మంత్రికి బెదిరింపు లేఖ రావడం తీవ్ర కలకలాన్ని రేపింది. పలస అసెంబ్లీ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న పశు సంవర్థక శాఖ మంత్రి సిదిరి అప్పలరాజుకు హెచ్చిరకలు జారీ అయ్యాయి. పద్ధతి మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని మంత్రికి మావోయిస్టుల నుండి హెచ్చరిక లేఖ వచ్చింది. పేదల భూములను కబ్జా చేసే అనుచరులను అదుపులో ఉంచుకోవాలని ఆయనకు హెచ్చరించారు. విప్లవ యువజన సంఘం (వీవీఎస్) ఆంధ్ర ఒడిశా బోర్డర్ కమిటీ కార్యదర్శి అశోక్ పేరిట లేఖ విడుదల కాగా ఇది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మంత్రికి మవోయిస్టుల నుండి హెచ్చరికలు జారీ అయ్యాయన్న వార్త ఉత్తరాంధ్రలో సంచనం అయ్యింది. ఈ లేఖపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కాగా ఈ లేఖ పై మంత్రి సిదిరి అప్పలరాజు స్పందించారు.
మావోయిస్టు లేఖలోని అంశాలతో తనకు సంబంధం లేదని పేర్కొన్నారు మంత్రి అప్పలరాజు. మవోయిస్టుల నుండి తనకు లేఖ రావడం ఆశ్చర్యం కలిగించే విషయమని అన్నారు. అసలు ఈ లేఖ నిజమా .. లేదా అనే విషయాన్ని తేల్చాల్సింది పోలీసులేనని అన్నారు. లేఖలో ప్రస్తావించిన రామకృష్ణాపురం భూములకు సంబంధించి, సూదికొండలోని గ్రావెల్ క్వారీతో తనకు సంబంధం ఏమిటని ప్రశ్నించారు. ప్రజల నుండి వ్యతిరేకత వ్యక్తం కావడంతో సూదికొండ క్వారీయింగ్ ను తానే ఆపించి కౌన్సిల్ లో తీర్మానం చేయించానని చెప్పారు. అయిత సూదికొండ క్వారీయింగ్ ఆపినందుకు తమ పార్టీలోని నాయకుడే తనపైే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఒక అసమ్మతి నేత తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.