AP YSRCP: రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వంపై, జగన్మోహనరెడ్డి పై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తం అవుతోందనీ, ఇప్పటికిప్పుడు రాష్ట్రంలో ఎన్నికలు వస్తే అధికార పార్టీకి చెందిన పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పరాజయం పాలవ్వడం ఖాయమంటూ ఇటీవల సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.
పలు సర్వేలు కూడా వైసీపీ ప్రభుత్వంపై వివిధ వర్గాలు గుర్రుగా ఉన్నారంటూ కూడా వెల్లడించాయంటూ సోషల్ మీడియాలో వార్తలు షికారు చేస్తున్నాయి. అయితే సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి మరో సారి సీఎం కావడం ఖాయమని ఆ పార్టీ వర్గాలు ఢంక భజాయించి చెబుతున్నారు. గతంలో ఏ ప్రభుత్వాలు అమలు చేయని విధంగా సంక్షేమ పథకాలను జగన్ అమలు చేస్తున్నారని వారు పేర్కొంటున్నారు.
AP YSRCP: వైసీపీకి అండగా ఆ అయిదు జిల్లాలు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుండి జగన్మోహనరెడ్డికి కడప, కర్నూలు, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలు అండగా నిలుస్తున్నాయి. 2012 ఉప ఎన్నికల్లోనూ ఆ తరువాత 2014 అసెంబ్లీ ఎన్నికలు, 2019 ఎన్నికల్లో ఆ జిల్లా ప్రజలు వైఆర్సీపీని ఆదరిస్తూనే ఉన్నారు. గత ఎన్నికల్లో 151 సీట్లు సాధించి వైఎస్ఆర్ సీపీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే గత ఎన్నికల్లో వచ్చిన మెజార్టీ ఈ సారి రకపోవచ్చనే మాట వినబడుతోంది. 175 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఏపిలో మ్యాజిక్ ఫిగర్ 88, 88 సీట్లు సాధించిన ఏ రాజకీయ పార్టీ అయినా అధికారంలోకి వస్తుంది. గత 2014 ఎన్నకిల్లో వైసీపీ 67 సీట్లు కైవశం చేసుకుంది. మ్యాజిక్ ఫిగర్ కు 21 సీట్లు దూరమయ్యి అధికారానికి దూరం అయ్యింది. ఆ తరువాత రాష్ట్రంలో సుదీర్ఘ కాలం పాటు జగన్మోహనరెడ్డి పాదయాత్ర చేసి జనాల మనసులను గెలుచుకున్నారు. దీంతో 2019 ఎన్నికల్లో అందరి అంచనాలకు భిన్నంగా 151 సీట్లు వైసీపీ గెలుచుకుని అధికారంలోకి వచ్చింది.
సీట్లు తగ్గినా అధికారం ఖాయమేనట
అయితే రాబోయే ఎన్నికల్లో వైసీపీకి సీట్లు తగ్గే అవకాశం ఉందని పలు సర్వేలు చెబుతున్నా వైసీపీ శ్రేణులు మాత్రం ఎలాగైనా మరో సారి అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. వైసీపీకి మ్యాజిక్ ఫిగర్ వచ్చేందుకు కడప, కర్నూలు, నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో దోహదపడతాయని అంటున్నారు. ఎందుకంటే ఈ జిల్లాల్లో వైసీపీకి ఆదరణ ఎక్కువే. గత రెండు ఎన్నికల్లో ఈ జిల్లాల్లో వైసీపీకే ఎక్కువ సీట్లు వచ్చాయి. ఈ సారి 2024 ఎన్నికల్లోనూ ఈ జిల్లాల్లో వైసీపి అత్యధిక స్థానాలు కైవశం చేసుకునే అవకాశం ఉందని లెక్కలు చెబుతున్నారు. ఈ అయిదు జిల్లాల్లో కలిపి మొత్తంగా 60 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వీటిలో 50 స్థానాలు వైసీపీ గెలుచుకున్నా మిగలిన జిల్లాల్లో ఉన్న 115 స్థానాల్లో 38 స్థానాలు వైసీపీ గెలుచుకుంటే జగన్ అధికారానికి ఢోకాలేదని చెబుతున్నారు.