Bharat Bandh : దేశ వ్యాప్తంగా శుక్రవారం భారత్ బంద్ కొనసాగుతోంది. దేశ వ్యాప్త బంద్ కు రాష్ట్ర ప్రభుత్వం, వైసీపీ, టీడీపీ, కాంగ్రెస్, వామపక్షాలు, బీఎస్పీ తదితర సంఘాలు మద్దతు ఇవ్వడంతో ఏపిలో బంద్ సంపూర్ణంగా జరుగుతోంది. కేంద్రం తీసుకువచ్చిన నూతన సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నాలుగు నెలలుగా ఢిల్లీ సరిహద్దులో ఆందోళనలు చేస్తున్న రైతు సంఘాలు శుక్రవారం భారత్ బంద్ కు పిలుపు నిచ్చిన సంగతి తెలిసిందే. బంద్ సందర్భంగా ఆర్ టీ సీ బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. వ్యాపార, వాణిజ్య సంస్థలు స్వచ్చందంగా మూసి వేసి బంద్ కు సహకరిస్తున్నాయి. ప్రైవేటు విద్యాసంస్థలకు యాజమాన్యాలు సెలవు ప్రకటించాయి. బస్సు సర్వీసులు నిలిచిపోవడంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, పెట్రోల్ , డీజిల్ ధరల పెంపు, నూతన సాగు చట్టాలను నిరసిస్తూ రాష్ట్రంలో వామపక్షాల నేతలు రోడ్లపైకి వచ్చి నిరసన తెలియజేస్తున్నారు. విశాఖపట్నం మద్దిలపాలెం జంక్షన్ వద్ద విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ నినాదాలు చేస్తూ వామపక్షాలు ఆందోళన చేపట్టాయి. రాష్ట్ర వ్యాప్తంగా బస్ స్టేషన్లు, డిపోల వద్ద వామపక్షాలు, ప్రజా సంఘాలు ఆందోళన చేట్టాయి. నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బలగాలు బందోబస్తు నిర్వహిస్తున్నాయి