KTR : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు, రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఇటీవల అనూహ్య రీతిలో ఏపీలో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ జరుగుతున్న ఉద్యమానికి కేటీఆర్ మద్దతు ప్రకటించడం తెలిసిందే. దీనికి టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కృతజ్ఞతలు తెలిపారు. కార్మికులు చేపట్టిన ఉద్యమంలో పాల్గొనేందుకు విశాఖ రావాలని కేటీఆర్ను, గంటా ఆహ్వానించారు. ఈ ఎపిసోడ్ లో తాజాగా కేటీఆర్ కు ఓ షాకిచ్చారు గంటా.
KTR కేటీఆర్ ను ఇరికించారుగా…
స్టీల్ ప్లాంట్ ఉద్యమంలో మొదట తన పదవికి రాజీనామా చేసిన టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఉద్యమంలో హీట్ పెంచారు. అయితే ఆ రాజీనామాపై విమర్శలు రావడంతో.. స్పీకర్ ఫార్మాట్లో మరోసారి రాజీనామా లేఖను పంపించారు. విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ ప్రక్రియ ప్రారంభంకాగానే తన రాజీనామా ఆమోదించాలని కోరారు. దీనికి కొనసాగింపుగా ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాంను కలిసిన గంటా శ్రీనివాసరావు తన రాజీనామాను ఆమోదించాలని స్పీకర్కు విజ్ఞప్తి చేశారు. అనంతరం గంటా శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
గంటా ఏమంటున్నారంటే…
విశాఖ ఉక్కు ప్లాంట్ పరిరక్షణ కోసం నాన్ పోలిటికల్ జేఏసీ ఏర్పాటు చేస్తామని గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. తన రాజీనామాతో ఖాళీ అయిన చోట మళ్లీ పోటీ చేయనని స్పష్టం చేశారు. స్టీల్ ప్లాంట్ నిర్వాసితున్ని తన స్థానంలో నిలబెడతానని గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. ఇక తెలంగాణ మంత్రి కేటీఆర్తో భేటీ అవడం గురించి పేర్కొంటూ తెలంగాణ మంత్రి కేటీఆర్ అసెంబ్లీ సమావేశాల తర్వాత విశాఖ వస్తారని గంటా తెలిపారు. అయితే, విశాఖ రావడం గురించి ఆలోచించి చెబుతానని కేటీఆర్ హామీ ఇచ్చినట్లు తెలిసింది. కానీ గంటా మాత్రం కేటీఆర్ వచ్చేస్తున్నారు అన్నట్లుగా చెప్పడం ఆయన్ను ఇరికించడమే అవుతుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.