CBI: దేశంలో న్యాయమూర్తులపై దాడులు, దుషణలు అధికం కావడంపై ఇటీవ సుప్రీం కోర్టు ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. నిఘా విభాగం (ఐబీ), కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) లు న్యాయవ్యవస్థకు సహకరించడం లేదంటూ కూడా సూప్రీం కోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఈ నేపథ్యంలో ఏపి హైకోర్టు, న్యాయమూర్తులపై సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యలు కేసులో సీబీఐ దూకుడు పెంచింది. మరో ఇద్దరు నిందితులను అరెస్టు చేసింది. శనివారం పి ఆదర్శ్, ఎల్ సాంబశివరెడ్డిని సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న లింగారెడ్డి రాజశేఖరరెడ్డిని జూలై 9న కువైట్ నుండి వస్తున్న సందర్భంలో అరెస్టు చేయగా, ఆ తరువాత జూలై 28న దామిరెడ్డి కొండారెడ్డి, పాముల సుధీర్ లను అరెస్టు చేశారు. శనివారం అరెస్టు చేసిన ఇద్దరు నిందితులు ఆదర్శ్, సాంబశివరెడ్డిలను కోర్టులో హజరుపర్చినట్లు పేర్కొన్నారు. తాజా అరెస్టులతో అరెస్టు అయిన వారి సంఖ్య అయిదుగురు చేరింది. ఇప్పటి వరకూ 16 మందిపై కేసులు నమోదు చేసినట్లు సీబీఐ అధికారులు తెలిపారు.
ఈ కేసులో వైసీపీకి చెందిన పార్లమెంట్ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే ప్రమేయంపైనా దర్యాప్తు జరుపుతున్నామనీ, మొత్తం 16 మందిలో ముగ్గురు విదేశాలలో ఉన్నారనీ, అయిదుగురిని అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. న్యాయమూర్తులపై వ్యాఖ్యల వెనుక భారీ కుట్ర ఉందని అనుమానిస్తున్నట్లు సీబీఐ అదికార ప్రతినిధి ఆర్ సీ జోషి తెలిపారు. న్యాయమూర్తులపై వ్యాఖ్యల కేసులో విచారణ జరిపి, పూర్తి స్థాయి నివేదిక అందించాలని ఏపి హైకోర్టు గతంలోనే సీబీఐని ఆదేశించిన సంగతి తెలిసిందే. సీబీఐ, ఐబీ పనితీరుపై సుప్రీం కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో సీబీఐ నుండి ప్రకటన విడుదల కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.