Neeraj Chopra: ఈరోజు అంటే నీరజ్ చోప్రా అథ్లెటిక్స్ లో భారత్ తరపున తొలి ఒలింపిక్ పతకం సాధించాడు. అయితే గత వందేళ్లలో భారత్ కి ఒకసారి కూడా అథ్లెటిక్స్లో కనీసం కాంస్యం కూడా దక్కక పోవడం వెనుక ఎన్నో కారణాలు ఉండొచ్చు. అందులో ముఖ్యంగా ఫిట్నెస్ సమస్యలు ఉంటాయి. మన అథ్లెట్లు ఎంతో మంది ఫిట్నెస్ సమస్యల కారణంగా పూర్తి స్థాయిలో ట్రాక్ అండ్ ఫీల్డ్ లో సత్తా చాటలేకపోయారు. మిల్కా సింగ్ నుండి పి.టి.ఉష వరకు ప్రతి ఒక్కరూ పతకం కొట్టే సామర్థ్యం ఉన్న వారే కానీ గాయాల కారణంగా గాడి తప్పి చివరి నిమిషంలో చరిత్ర ముంగిట సాగిలపడడం భారతీయులకు మామూలే అయిపోయింది.
ఏకంగా మోచేయే…
అయితే ఎంతో టాలెంట్ ఉన్న నీరజ్ కూడా ఇలాగే తన కెరీర్ అస్తవ్యస్తం అయ్యే స్థితి నుండి కోలుకొని తిరిగి లేచాడు. 2019 మధ్యలో అంటే ఏడాదిన్నర క్రితం చోప్రా మోచేతికి అతి పెద్ద గాయం అయింది. ఒక జావలిన్ త్రోయర్ కు మోచేయి ఎంత అవసరమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాంటి కీలకమైన మోచేయి శస్త్రచికిత్సను నీరజ్ కు ముంబైకి చెందిన దిన్షా పరిద్వాలా చేశారు. పరిద్వాలా నీరజ్ కే కాకుండా ప్రధాన భారతీయ క్రికెటర్లైన జస్ప్రిత్ బూమ్రా, శ్రేయస్ అయ్యర్ లకు కూడా గతంలో ఎన్నో ఎముకలు, కీళ్లకు సంబంధించిన శస్త్ర చికిత్సలు చేశారు.
అలాగే భారత స్టార్ క్రీడాకారిణులు అయిన సైనా నెహ్వాల్, పివి సింధు, పోగాట్ సిస్టర్స్ లకి కూడా ఈయనే ఆర్థోపెడీషియన్ గా ఉన్నారు. కానీ నీరజ్ కి శస్త్ర చికిత్స చేయడంలో కొద్దిగా పొరపాటు జరిగినా ఇక జీవితంలో అతను జావెలిన్ లేపలేకపోయేవాడని ఉద్వేగభరితుడైన పరిద్వాలా శనివారం చెప్పుకొచ్చారు. 2019లో మోచేయి గాయం కారణంగా దోహా ప్రపంచ ఛాంపియన్షిప్ కు నీరజ్ చోప్రా దూరం అయ్యాడు. అది చాలా సీరియస్ గాయం.
Neeraj Chopra: అయిదు నెలలు ఫీల్డ్ కి దూరం
మే 3వ తేదీన దీరూ భాయ్ అంబానీ ఆస్పత్రిలో పరిద్వాలా కి శస్త్రచికిత్స జరిగింది. అతను కుడి చేయి మోచేతికి గాయం కావడంతో జీవితంలో ఇంకెప్పుడు అతను జావెలిన్ విసరలేడు అని అనుకున్నారు. అతని మోచేయ్ కూడా స్థిరంగా ఒకచోట ఉండిపోయింది. అటూ ఇటూ కదలడం లేదు. లోపల ఉండే కణజాలాలు మొత్తం చీలిపోయాయి. ఆ కణజాలాలను తీసేసి రిపేర్ చేయవలసిన పరిస్థితి. దాదాపు రెండు గంటల సర్జరీ తర్వాత అతను నాలుగు నెలలు రిహబిలెషన్ కు వెళ్ళాడు.
కట్ చేస్తే… ఒలింపిక్ విన్నర్
ఆ తర్వాత కూడా నీరజ్ చోప్రా మళ్లీ కోలుకుంటాడు అని ఎవరికీ ఆశలు లేవు. ఇక అతని కెరీర్ ముగిసిపోయింది అని అనుకున్నారు. అయితే నీరజ్ చోప్రా మాత్రం మానసికంగా బలంగా ఉండి మళ్ళీ ఫీల్డ్ కి తిరిగి వచ్చాడు. ఎంతో కఠోర శ్రమ ఒత్తిడి అనుభవించిన నీరజ్ చోప్రా తను కోలుకున్నాక నేరుగా డాక్టర్ దగ్గరికి వెళ్లి ఈసారి ఒలింపిక్స్లో తాను కచ్చితంగా బంగారు పతకం సాధిస్తానని అన్నాడు. ఆ సంకల్పం, నమ్మకమే అతన్ని ఇప్పుడు ప్రపంచ ఛాంపియన్ గా నిలిపింది. తన చేతిని పైకి ఎత్తలేడు అనుకున్న నీరజ్ చోప్రా ఏకంగ బంగారు పతకం ఎత్తి అందరికీ స్పూర్తిని ఇచ్చాడు.