YS Viveka Murder Case: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సీబీఐ అధికారులు మరో సారి నోటీసులు అందజేశారు. ఇంతకు ముందు ఈ నెల 6వ తేదీ (ఈరోజు) విచారణకు హజరుకావాలంటూ సీబీఐ అధికారులు అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కరరెడ్డిలకు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాలు ఉండటంతో ఆరవ తేదీ విచారణకు హజరు కాలేనంటూ అవినాష్ రెడ్డి సీబీఐ అధికారులకు లేఖ రాశారు. ఈ మేరకు సీబీఐ అధికారికి మెయిల్ పంపారు.
అవినాష్ రెడ్డి వినతిపై సానుకూలంగా స్పందించిన సీబీఐ అధికారులు విచారణ తేదీ మార్పు చేశారు. నిన్న రాత్రి మరో సారి పులివెందుల లోని అవినాష్ రెడ్డి ఇంటికి వెళ్లి మరీ నోటీసులు అందజేశారు. ఈ నెల 10వ తేదీన హైదరాబాద్ సీబీఐ కార్యాలయంలో విచారణకు హజరు కావాలని నోటీసుల్లో అధికారులు పేర్కొన్నారు. అలాగే 12వ తేదీన విచారణకు హజరు కావాలని అవినాష్ రెడ్డి తండ్రి భాస్కరరెడ్డికి నోటీసులు జారీ చేశారు. అయితే ఈ సారి విచారణకు కచ్చితంగా హజరుకావాలని సీబీఐ అధికారులు పేర్కొన్నారు. ఈ నోటీసుల నేపథ్యంలోో 10వ తేదీ హైదరాబాద్ సీబీఐ కార్యాలయానికి విచారణ నిమిత్తం అవినాష్ రెడ్డి హజరు కావాల్సి ఉండగా, భాస్కరరెడ్డి 12వ తేదీ కడప సెంట్రల్ జైలు గెస్ట్ హౌస్ నందు సీబీఐ అధికారుల ముందు హజరు కావాల్సి ఉంటుంది.
అవినాష్ రెడ్డిని ఇప్పటికే రెండు పర్యాయాలు సీబీఐ అధికారులు విచారణ చేశారు. మొదటి సారి విచారణ సందర్భంలో మరో సారి విచారణ రావాల్సి ఉంటుందని చెప్పిన సీబీఐ అధికారులు, రెండవ సారి విచారణ సమయంలో మరో సారి రావాల్సి ఉంటుందని తెలుపలేదు. ఆ సమయంలో సీబీఐ అధికారుల దర్యాప్తు తీరుపై అవినాష్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. వ్యక్తి టార్గెట్ గా విచారణ జరుగుతోందని ఆయన ఆరోపించారు.
ఆ నేపథ్యంలో అవినాష్ రెడ్డిని మూడో సారి విచారణకు పిలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు మూడో సారి విచారణకు పిలవడంతో రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాశం అవుతోంది. కాగా తాజా విచారణ తేదీలతో సీబీఐ అధికారులు జారీ చేసిన నోటీసులుపై అవినాష్ రెడ్డి ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.
పోలవరం ప్రాజెక్టు విషయంలో మంత్రి అంబటి రాంబాబు సంచలన కామెంట్స్