Chandra Babu Delhi Tour: టీడీపీ (TDP) అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ (పట్టాభి) (PattaBhi) ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి (YS Jagan Mohan Reddy) పై వ్యక్తిగత దూషణల దుమారం నేపథ్యంలో వైసీపీ శ్రేణులు టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడులు చేయడం తీవ్ర సంచలనం సృష్టించిన సంఘటన తెలిసిందే. ఈ ఘటనను నిరసిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేపట్టిన 36 గంటల దీక్ష శుక్రవారం సాయంత్రం ముగిసింది. ఈ క్రమంలో టీడీపీ నేతలు ఆవేశపూరితంగా ప్రసంగాలు చేస్తూ వైసీపీపై సవాళ్లు విసిరారు. టీడీపీ, వైసీపీ నేతల మధ్య విమర్శలు, ప్రతివిమర్శలతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. కాగా రాష్ట్రంలోని పరిణామాలపై కేంద్రానికి ఫిర్యాదు చేయడానికి టీడీపీ సన్నద్దం అయిన సంగతి తెలిసిందే.
Chandra Babu Delhi Tour:రాష్ట్రపతి అపాయింట్ మెంట్ ఖరారు
టీడీపీ అధినేత చంద్రబాబు కేంద్ర మంత్రి హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిసేందుకు గానూ ఆపార్టీ ముఖ్య నేతలు ఆయన అపాయింట్మెంట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అయితే ఇంత వరకూ ఖరారు కాలేదని తెలుస్తోంది. ఇదే సమయంలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అపాయింట్మెంట్ ఖరారు అయినట్లు తెలుస్తోంది. చంద్రబాబు నేతృత్వంలో ఆ పార్టీ పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యేల, పలువురు ముఖ్యనేతలు బృందంగా రాష్ట్రపతిని సోమవారం కలవనున్నారు. సోమవారం ప్రత్యేక విమానంలో చంద్రబాబు నేతృత్వంలో టీడీపీ బృందం హస్తినకు బయలుదేరి వెళ్లనున్నారు. ఏపి లో ఆర్టికల్ 356 అమలు చేయాలని రాష్ట్రపతికి చంద్రబాబు ఫిర్యాదు చేయనున్నారు. చంద్రబాబు బృందం తమ ఢిల్లీ పర్యటనలో పలువురు కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిసే అవకాశం ఉందని అంటున్నారు.
గెలవలేదు .. గుద్దుకున్నారు
చంద్రబాబు నాయుడు 36 గంటల దీక్ష విరమణ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శించారు. తిరుపతి ఉప ఎన్నిక ఎన్నికల నిబంధనల ప్రకారం జరిగిందా ప్రశ్నించారు. ప్రతి ఎన్నికల్లోనూ తాము గెలుస్తామని వైసీపీ ప్రకటించుకోవడాన్ని చంద్రబాబు తప్పుబడుతూ వాళ్లు గెలవలేదు…గుద్దుకున్నారు అంటూ తీవ్ర స్థాయిలో ఆరోపణ చేశారు. పోలీసులతో బలవంతంగా నామినేషన్లు ఉపసంహరించడం, రిగ్గింగ్ లకు పాల్పడటం జరిగిందన్నారు. తిరుపతిలో దొంగ ఓట్లు వేసేందుకు వచ్చిన వాళ్లను పట్టుకున్నామా లేదా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో వైసీపీ పాలన ఎంత ఆరాచకంగా ఉందో ప్రజలందరికీ అర్ధం కావాల్సిన పరిస్థితి ఉందని అన్నారు. టీడీపీ ఆఫీసుపై దాడి ఎక్కడో అడవిలోనో, మారుమూల ప్రాంతంలోనో జరగలేదనీ, డీజీపీ ఆఫీసుకు కూతవేటు దూరంలో జరిగిందన్నారు.