Chandrababu Arrest: స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్ లో అండర్ ట్రైల్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. చంద్రబాబును కస్టడీలోకి తీసుకుని రెండు రోజుల పాటు విచారణ జరిపేందుకు ఏసీబీ కోర్టు అనుమతి ఇవ్వడంతో ఇవేళ సీఐడీ అధికారుల బృందం రాజమండ్రి సెంట్రల్ జైల్ కు చేరుకుని ఇంటరాగేషన్ చేస్తొంది. చంద్రబాబు తరపున దమ్మాలపాటి శ్రీనివాస్, గింజుపల్లి సుబ్బారావు సమక్షంలో సీఐడీ డీఎస్పీ ధనుంజయుడు నేతృత్వంలోని బృందం ఇంటరాగేషన్ జరుపుతోంది. విచారణకు ముందు చంద్రబాబుకు వైద్య పరీక్షలు చేయగా, విచారణ పూర్తి అయిన తర్వాత కూడా వైద్య పరీక్షలు చేయనున్నారు. ఈ రోజు, రేపు 9.30 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకూ చంద్రబాబును సీఐడీ విచారణ చేస్తుంది.
అయితే ఆయన ఆరోగ్య రీత్యా గంటకు అయిదు నిమిషాలు విచారణ బ్రేక్ ఇవ్వాలని నిర్ణయించారు. మధ్యాహ్నం ఒంటి గంట నుండి 2 గంటల వరకూ లంచ్ బ్రేక్ ఉండనుంది. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని రాజమండ్రి జీజీహెచ్ కు చెందిన వైద్య అధికారుల బృందాన్ని జైల్ వద్ద అంబులెన్స్ లతో ఏర్పాటు చేశారు. జైల్ లోని కాన్ఫరెన్స్ హాలులో చంద్రబాబును సీఐడీ అధికారులు విచారణ చేస్తున్నారు. విచారణ ప్రక్రియ మొత్తం సీఐడీ వీడియో గ్రఫీ తీస్తున్నది. చంద్రబాబు విచారణ నేపథ్యంలో జైల్ పరిసరాల్లో రెండంచెల భారీ బందోబస్తు ను అధికారులు ఏర్పాటు చేశారు.
సీఐడీ డీఎస్పీ ధనుంజయుడు నేతృత్వంలో అధికారులు వి విజయభాస్కర్, ఎ లక్ష్మీనారాయణ, ఎం సత్యనారాయణ, మోహన్, రవికుమార్, శ్రీనివాస్, రంగనాయకులు మరో ఇద్దరు మధ్యవర్తుల సమక్షంలో విచారణ కొనసాగిస్తున్నారు. తొలుత చంద్రబాబును అరెస్టు చేసిన తర్వాత సిట్ కార్యాలయంలో సీఐడీ అధికారులు విచారణ జరిపిన సందర్భంలో వారు అడిగిన ప్రశ్నలకు తనకు తెలియదు, గుర్తు లేదు అన్నట్లుగా సమాధానాలు చెప్పారుట. అయితే ఇప్పుడు విచారణ సమయంలో చంద్రబాబు నుండి ఏ విధంగా సమాధానాలు రాబడతారు అనేది ఆసక్తికరంగా మారింది. విచారణ అంశాలను మీడియాకు లీక్ చేయవద్దని ఏసీబీ కోర్టు ఆదేశిస్తూ, విచారణ నివేదకను సీల్డ్ కవర్ లో కోర్టు అందజేయాలని న్యాయమూర్తి ఆదేశించారు.