Chandrababu: ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు డిస్మిస్ చేసిన నేపథ్యంలో హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో చంద్రబాబు తరపు న్యాయవాదులు పిటిషన్ వేశారు. తనపై ఏసీబీ కోర్టు ఇచ్చిన రిమాండ్ ను క్వాష్ చేయాలని పిటిషన్ లో చంద్రబాబు కోరారు. సుప్రీం కోర్టు రిజిస్ట్రీలో పిటిషన్ కాపీని చంద్రబాబు తరపు న్యాయవాదులు అందజేశారు. సోమవారం ఈ పిటిషన్ విచారణకు వస్తుందని భావిస్తున్నారు.
ఒక వేళ సోమవారం విచారణకు రాకపోతే ప్రధాన న్యాయమూర్తి ఎదుట ప్రత్యేకంగా మెన్షన్ చేసి.. వెంటనే విచారణ చేపట్టాలని కోరే అవకాశం ఉంది. ఈ నెల 26వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకూ సుప్రీం కోర్టు సెలవులు ఉన్న నేపథ్యంలో ఈ లోపుగానే సుప్రీం కోర్టులో విచారణకు వచ్చేలా చంద్రబాబు తరపు న్యాయవాదులు సీజే ధర్మాసనం ముందు ప్రత్యేకంగా మెన్షన్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. దర్యాప్తు తుది దశలో జోక్యం చేసుకోలేమంటూ క్వాష్ పిటిషన్ ను హైకోర్టు తోసి పుచ్చింది. సెక్షన్ 482 కింద దాఖలైన వ్యాజ్యంలో మినీ ట్రయల్ నిర్వహించలేమని హైకోర్టు తెలిపింది. 17(ఏ) చంద్రబాబుకు వర్తిస్తుందని సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ లో చంద్రబాబు తరపు న్యాయవాదులు పేర్కొన్నారు.
మరో పక్క సీఐడీ కస్టడీపై ఏసీబీ కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ చంద్రబాబు తరపు న్యాయవాదులు ఏపీ హైకోర్టులో దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ ను న్యాయస్థానం తిరస్కరించినట్లుగా తెలుస్తొంది. కాగా ఏసీబీ కోర్టు అనుమతితో రాజమండ్రి సెంట్రల్ జైల్ లో ఉన్న చంద్రబాబును సీఐడీ అధికారులు కస్టడీ విచారణ నిర్వహిస్తున్నారు. ఉదయం 9.30 గంటలకు ప్రారంభం కావాల్సిన చంద్రబాబు సీఐడీ విచారణ వైద్య పరీక్షల కారణంగా ఆలస్యంగా ప్రారంభం అయినట్లుగా తెలుస్తొంది. సీఐడీ డీఎస్పీ ధనుంజయుడు నేతృత్వంలో అధికారుల బృందం .. చంద్రబాబు న్యాయవాదుల సమక్షంలో ఆయనను విచారణ జరుపుతోంది.
Chandrababu Arrest: చంద్రబాబును విచారిస్తున్న సీఐడీ అధికారుల బృందం