వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలో ఇవేళ తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్ .. పలువురి ఎమ్మెల్యేల పనితీరు మార్చుకోకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తొంది. మొక్కుబడిగా కార్యక్రమాలు నిర్వహిస్తే కుదరదని స్పష్టం చేశారు. గడపగడపకు కార్యక్రమాన్ని ఆషామాఫీగా నిర్వహిస్తే ఊరుకోనని జగన్ హెచ్చరిస్తూ, ఆ నియోజకవర్గాల్లో కొత్త వారికి అవకాశం ఇవ్వాల్సి ఉంటుందని జగన్ స్పష్టం చేశారుట. రాబోయే రోజుల్లో పార్టీ పరంగా ప్రారంభించనున్న కార్యక్రమంపై దిశానిర్దేశం చేశారు.
జగనన్నే మా భవిష్యత్తు అన్న నినాదంతో ప్రతి గడపగకూ వెళ్లి గృహ సారథులు పని చేయాలని జగన్ పిలుపునిచ్చారు. ప్రతి ఇంటికి వెళ్లి గత ప్రభుత్వం, మన ప్రభుత్వం మధ్య వ్యత్యాసం వివరించాలని తెలిపారు. ఎన్నికల కోడ్ లేని జిల్లాల్లో గడప గడపకు మన ప్రభుత్వం కొనసాగించాలని, ఎన్నికల కమిషన్ ఆదేశాలకు అనుగుణంగా మిగతా జిల్లాల్లో నిర్వహించాలని జగన్ సూచించారు. దాదాపు అయిదు లక్షల మంది గృహ సారధులను నియమించుకున్నామనీ, ఫిబ్రవరి 16 లోగా అక్కడక్కడా మిలిగిపోయిన నియామకాలు పూర్తి చేయాలన్నారు. గృహ సారధులు, సచివాలయ కన్వీనర్ల మొదటి బ్యాచ్ కు శిక్షణ కార్యక్రమాలు 387 మండలాల్లో ముగిశాయనీ, రెండో బ్యాచ్ కు శిక్షణ కార్యక్రమాలు మిగిలిన మండలాల్లో రేపటి నుండి ప్రారంభించి ఫిబ్రవరి 19 వరకూ ముగించాలన్నారు.
మండలాల వారీగా జరిగే ఈ శిక్షణా కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు పాల్గొనాలని చెప్పారు. ఈ శిక్షణ కార్యక్రమాలు ముగిసిన తర్వాత క్షేత్ర స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. మార్చి 18 నుండి 26వరకూ జగనన్నే మా భవిష్యత్తు క్యాంపెయిన్ ను పార్టీకి చెందిన సచివాలయ కన్వీనర్లు, గృహ సారధులు డోర్ టు డోర్ నిర్వహించనున్నారు. సుమారు 14 నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయనీ, టీడీపీ సహా వారి అనుకూల మీడియా చేస్తున్న అసత్య ప్రచారాలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని జగన్ సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్ధుల విజయానికి అందరూ కలిసికట్టుగా పని చేయాలని చెప్పారు.
ఏపి ప్రభుత్వ చర్యలపై ప్రశంసలు కురిపించిన ఆస్ట్రేలియా ఎంపీల వాణిజ్య ప్రతినిధుల బృందం