CM YS Jagan: ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి జిల్లా కేంద్ర సహకార బ్యాంకులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. ఈ ఆదేశాలతో రైతులకు గుడ్ న్యూస్ అందించినట్లు అవుతోంది. సహకార బ్యాంకుల ద్వారా వీలైనంద తక్కువ వడ్డీకే రుణాలు ఇవ్వాలని సీఎం జగన్ ఆదేశించారు. సహకార శాఖపై గురువారం సీఎం జగన్ సమీక్ష జరిపారు. రాష్ట్రంలోని జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల పని తీరు. వాటి బ్రాంచిలు, ప్రాధమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల పని తీరుపై సమీక్ష జరిపిన సీఎం జగన్..కీలక ఆదేశాలు ఇచ్చారు. సహకార బ్యాంకులు మన బ్యాంకులు వీటిని మనం కాపాడుకోవాలని అన్నారు. తక్కువ వడ్డీలకు రుణాలు ఇవ్వడం వల్ల ప్రజలకు, రైతులకు మేలు జరుగుతుందని అన్నారు. వెసులుబాటు మేరకు ఎంత తక్కువ వడ్డీకి రుణాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుందో అంత తక్కువ వడ్డీకి రుణాలు ఇవ్వాలని ఈ సందర్భంగా సీఎం జగన్ ఆదేశించారు.
CM YS Jagan: ఆకర్షనీయమైన వడ్డీ రేట్లతో రుణాలు ఇవ్వాలి
బ్యాంకింగ్ రంగంలో పోటీని ఎదుర్కొనేలా డీసీసీబీలు, సొసైటీలు ఉండాలని సూచించారు. ఈ పోటీని తట్టుకునేందుకు ఆకర్షనీయమైన వడ్డీ రేట్లతో రుణాలు ఇవ్వాలని చెప్పారు. డీసీసీబీలు లాభాల బాట పట్టేలా చూడాలని తెలిపారు. అదే విధంగా బంగారు తాకట్టుపై రుణాలను కూడా వాణిజ్య బ్యాంకులు, ఇతర బ్యాంకులకన్నా తక్కువ వడ్డీకే రుణాలు ఇవ్వడం ద్వారా ఖాతాదారులను తమ వైపుకు మళ్లించుకోవాలని తద్వారా ఇటు సహకార బ్యాంకులకు, అటు ఖాతాదారులకు మేలు జరుగుతుందని అన్నారు. రుణాల మంజూరులో ఎక్కడా రాజీ ఉండకూడదనీ, రాజకీయాలకు చోటు ఉండకూడదని సీఎం జగన్ స్పష్టం చేశారు. అవినీతికి, సిఫార్సులకు తావు లేకుండా కేంద్ర సహకార బ్యాంకు కార్యకలాపాలు జరగాలన్నారు. ఆర్బీకేల్లో ఉన్న కియోస్కులను సమర్ధవంతంగా వాడుకోవాలని సీఎం జగన్ సూచించారు.