TTD: తిరుమల శ్రీవారికి నిత్యం లక్షలాది మంది భక్తులు దర్శించుకుని మొక్కుబడులు చెల్లించుకుంటుంటారు. వేలాది మంది ప్రముఖులు ఆలయానికి భూరి విరాళాలను సమర్పిస్తుంటారు. ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు నగలు, అభరణాలు, పెద్ద మొత్తంలో నగదు విరాళంగా అందజేసి తమ భక్తిని చాటుకుంటుంటారు. కొందరు తమ ఆస్తులను సైతం స్వామివారికి రాసి ఇస్తుంటారు. అదే మాదిరిగా తమిళనాడుకు చెందిన ఓ భక్తురాలు నేడు కోట్లాది విలువైన ఆస్తిని స్వామివారికి సమర్పించారు. శ్రీవారికి నేడు రూ.9 కోట్ల 20 లక్షల భారీ విరాళం అందింది. దీనికి సంబంధించిన పత్రాలను దాత దివంగత డాక్టర్ ఆర్ పర్వతం జ్ఞాపకార్థం ఆమె సోదరి రేవతి విశ్వనాథం శ్రీవారి ఆలయంలో టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి కి గురువారం అందజేశారు.
చెన్నె మైలాపూర్ కు చెందిన దివంగత డాక్టర్ పర్వతం పేరు మీద బ్యాంకు లో రూ.3 కోట్ల 20 లక్షల నగదు డిపాజిట్లు ఉన్నాయి. దీంతో పాటు రూ.6 కోట్ల విలువైన రెండు ఇళ్ళు ఉన్నాయి. డాక్టర్ పర్వతం మృతి చెందడంతో ఆమె జ్ఞాపకార్థం ఆమె సోదరి రేవతి విశ్వనాథం ఈ ఆస్తిని శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు పత్రాలను శ్రీవారి ఆలయంలోని రంగనాయక మండపంలో టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి కి నేడు అందజేశారు.