ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు కారణంగా గోదావరికి వరద మళ్లీ పొటెత్తుతోంది. భారీగా వరద నీరు వస్తున్న నేపథ్యంలో దవళేశ్వరం ప్రాజక్టు వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. వరద ప్రవాహం గంట గంటకు పెరుగుతోంది. కోనసీమలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి, కొన్ని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. శుక్రవారం ఉదయం ఇన్ ఫ్లో 14,73,739 లక్షల క్యూసెక్కులు ఉండగా అంతే మొత్తంలో సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. పోలవరం నుండి ప్రాజెక్టు కు వెళ్లే దారిలో కడెమ్మ వంతెనపై, పోలీసు చెక్ పోస్టులోకి నీరు చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
అల్లూరి సీతారామరాజు జిల్లాలోని కూనవరం, టేకులబోరు, శబరికొత్తగుడెం, టేకుబాక, తాళ్లగూడెం గ్రామాల్లో వందల ఇళ్లు జలమయం అయ్యాయి. నెల రోజుల వ్యవధిలోనే రెండో సారి ఇళ్లు వరద పాలు కావడంతో పూర్తిగా దెబ్బతింటాయనే గ్రామంలోని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గోదావరి వరద ఉదృతి పెరుగుతున్న నేపథ్యంలో ఏపి రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ హెచ్చరికలు జారీ చేశారు. సహాయక చర్యల్లో అధికారులకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నాారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరంలో ఎన్డీఆర్ఎఫ్, అమలాపురంలో రెండు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, ఏలూరు జిల్లా కుకునూర్ లో ఎన్డీఆర్ఎఫ్ బృందంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.ముంపు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
భద్రాచలం వద్ద గోదావరి వరద నెమ్మదిగా పెరుగుతోంది. గురువారం ఉదయం 51.30 అడుగులు ఉన్న వరద శుక్రవారం ఉదయానికి 53 అడుగులకు చేరింది. కుక్కనూరు, వేలేరుపాడు మండలాల్లోని గ్రామాల సమీపంలోకి వరద నీరు చేరింది. భద్రాచలం – అశ్వారావుపేట వయా కుక్కునూరు అంతర్జాతీయ రాహదారి గోదావరి వరదలో మునిగిపోవడంతో ఈ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి.