RGV: నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పేరు దేశ వ్యాప్తంగా మారుమోగుతోంది. కరోనా వైద్యానికి ఆనందయ్య ఇస్తున్న ఆయుర్వేద మందు కరోనా బాధితులకు సంజీవనిగా పని చేస్తుందని వివిధ ప్రాంతాల నుండి వేలాది మంది ప్రజలు ఆ గ్రామానికి రావడం, అది కాస్తా సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరగడంతో లోకాయుక్త ఆదేశాలతో జిల్లా అధికారులు ఆ మందు పంపిణీని నిలుపుదల చేయడం, ఆ తరువాత ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత రావడంతో అక్కడి స్థానిక వైసీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్ రెడ్డి నేతృత్వంలో నిన్న మందు పంపిణీని ప్రారంభించడం (ఒక్క రోజు) తెలిసిందే.
ఆనందయ్య నుండి మందు తీసుకున్న వేలాది మంది నుండి ఎటువంటి అభ్యంతరాలు, ఫిర్యాదులు లేకున్నా, దుష్ప్రభావాలు కనబడకపోయినా మందు పంపిణీ నిలిపివేయడం ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు. మరో పక్క ఆనందయ్య ఆయుర్వేద మందుతో కోలుకున్న వారి వీడియోలు సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తున్నాయి. ఆ మందు చాలా బాగా పని చేస్తుందంటూ పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మరి కొందరు శాస్త్రీయ నిర్ధారణ కాకుండా మందును ఎలా పంపిణీ చేస్తున్నారు అని ప్రశ్నిస్తున్నారు. ఈ ఆయుర్వేద మందుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కూడా స్పందించింది. సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి అధికారులతో సమీక్ష జరిపారు. ఆ మందు శాస్త్రీయతపై పరిశీలన జరపాలంటూ ఆయుష్, ఐసీఎంఆర్ అధికారులను కోరారు.
సీఎం సూచనల మేరకు ఆయుష్, ఐసీఎంఆర్ బృందం నిన్న కృష్ణపట్నం గ్రామానికి ఆనందయ్య ఆయుర్వేద మందుపై పూర్తి స్థాయిలో వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆ మందు శాస్త్రీయతపై అధ్యయనం చేస్తున్నారు. ఆ మందుపై పూర్తి స్థాయిలో పరిశీలన జరిపిన అనంతరం ప్రభుత్వం పంపిణీకి అనుమతులు ఇస్తుందని అందరూ భావిస్తున్నారు. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సైతం ఐసీఎంఆర్ చీఫ్ తో ఈ విషయంపై మాట్లాడి త్వరగా ఆ మందుపై నివేదిక పంపాలని కోరారు. ఈ వ్యవహారం హాట్ టాపిక్ నడుస్తున్న తరుణంలో వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన దైన స్టైల్ లో స్పందించడం చర్చనీయాంశంగా మారింది. ఆయుర్వేద నిపుణుడు ఆనందయ్యపై ఓ రేంజ్ లో వ్యంగ్యాస్త్రాలు సందించారు. ఈ మేరకు శుక్రవారం అర్థరాత్రి వరకూ వరస ట్వీట్లు చేశారు.
కళ్లకు, ఊపిరితిత్తులకు ఉన్న సంబంధం ఏమిటో ఆర్థం కావడం లేదు. ఫైజర్, మోడెర్నా వంటి వ్యాక్సిన్ నిపుణులే తమ ఫార్మలా ఎవరికీ షేర్ చేయలేదు. కానీ ఆనందయ్య మాత్రం ఎవరు అడిగితే వారికి ఉచితంగా ఉచితంగా ఇచ్చేస్తున్నారు. ఆనందయ్యకు నోబెల్ ప్రైజ్ ఇవ్వాల్సిందే. ప్రభుత్వం కూడా ఇక బారత్ బయోటెక్, పూనావాలా, స్పుత్నిక్ వాక్సిన్ లకు నిధులు ఇవ్వడం ఆపేసి ఆ డబ్బు ఆనందయ్య ఇవ్వాలని కోరుతున్నా, ప్రభుత్వం అనందయ్యకు సహకరిస్తే వేపాకు, గుజ్జు, బీట్ రూట్, వేరుశగపప్పు, గడ్డి, ఉల్లిగడ్డలు ఇలా ఏవైనా సరే అన్నింటినీ కలిపేసి ప్రజల జీవితాలను కాపాడతారు అంటూ వ్యగ్యంగా ట్వీట్ లు చేశారు రామ్ గోపాల్ వర్మ. వర్మ ట్వీట్ లపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
కాగా మరో పక్క పోలీసులు శుక్రవారం రాత్రి కృష్ణపట్నం వెళ్లి అనందయ్య ఇంట్లో మందు తయారీ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. మందు పంపిణీ నిలిపివేయడం జరిగిందన, ప్రభుత్వ ఆనుమతి వచ్చే వరకూ మందు పంపిణీ జరగదని చెప్పి అక్కడ ఉన్నవారిని పంపించి వేశారు.