Bapatla: బాపట్ల జిల్లా ఉప్పలవారిపాలెంలో టెన్త్ విద్యార్ధి అమర్నాధ్ ను కొందరు సజీవ దహనం చేసిన ఘటన తీవ్ర కలకలం సృష్టించిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ రేపల్లె టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ఆధ్వర్యంలో చెరుకుపల్లి ఐలాండ్ సెంటర్ వద్ద శనివారం రాస్తారోకో నిర్వహించారు. బాలుడి మృతదేహాన్ని రాజోలు తీసుకువస్తుండగా మార్గమధ్యంలో చెరుకుపల్లి వద్ద అడ్డుకుని ఆందోళన చేపట్టారు. అమర్నాధ్ మృతదేహాన్ని జాతీయ రహదారిపై ఉంచి ఆందోళన చేశారు.
వివిధ ప్రాంతాల నుండి వచ్చిన టీడీపీ, శ్రేణులు, బీసీ సంఘాల నేతలు, కార్యకర్తలతో ఐలాండ్ సెంటర్ నిండిపోయింది. బాధిత కుటుంబానికి రూ.25 లక్షలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నుండి హామీ వచ్చే వరకూ ధర్నా చేస్తామని బీష్మించుకుని కూర్చున్నారు. దీంతో జాతీయ రహదారిపై దాదాపు మూడు గంటల పాటు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో రేపల్లె ఆర్డీవో పార్ధసారధి అక్కడకు చేరుకుని కలెక్టర్ తో ఫోన్ లో మాట్లాడారు. చివరకు రాష్ట్ర ప్రభుత్వం నుండి రూ.10లక్షల ఆర్ధిక సాయం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, ఇంటి స్థలం ఇస్తామని, ఆందోళన విరమించాలని కోరారు. దీంతో వారు ఆందోళన విరమించారు. అనంతరం అమర్నాథ్ మృతదేహాన్ని ఉప్పాలవారిపాలెం తరలించి అంత్యక్రియలు నిర్వహించారు.
మరో పక్క ఈ ఘటనలో రాజకీయ ప్రమేయం లేదని బాపట్ల ఎస్పీ వకుల్ జిందాల్ ఇవేళ మీడియా సమావేశంలో వెల్లడించారు. విద్యార్ధి ఉప్పాల అమర్ నాథ్ బాల్యంలోనే తండ్రి చనిపోగా తల్లి, సోదరి, తాతయ్యతో కలిసి ఉంటున్నారనీ, రాజోలు పంచాయతీ రెడ్లపాలేనికి చెందిన యువకుడు వెంకటేశ్వరరెడ్డి ప్రేమ పేరుతో తన అక్కడను వేధిస్తున్నాడని అమర్ నాథ్ అతనిని నలుగురిలో నిలదీయడంతో అతనిపై కక్ష పెంచుకున్నాడన్నారు. అంతే కాకుండా తన అక్కను ఇబ్బంది పెడుతున్నాడంటూ అమరనాథ్ తోటి వారితో కూడా చెప్పడంతో వెంకటేశ్వరరెడ్డి మరింత కోపం పెంచుకుని హత్య చేయాలని పథకం వేశాడన్నారు.
ఇందు కోసం ఒక రోజు ముందే పెట్రోల్ కొనుగోలు చేసి శుక్రవారం ఉదయం ట్యూషన్ కు వెళుతున్న అమరనాథ్ ను మరి కొందరు స్నేహితులతో కలిసి అడ్డగించి ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పు అంటించారన్నారు. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురు నిందితులను అరెస్టు చేశామనీ, మరో నిందితుడు పరారీలో ఉన్నాడని చెప్పారు. అమరనాథ్ చనిపోయే ముందు ఇచ్చిన మరణ వాంగ్మూలాన్ని వీడియో రూపంలో సేకరించామని, ఈ కేసును ఫాస్ట్ ట్రాక్ చేసి దోషులకు శిక్ష పడేలా అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. ఇందులో మృతుడు, నిందితుడి కుటుంబాలకు ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదనీ, ఇద్దరు యువకుల మధ్య జరిగిన ఒక వ్యక్తిగత విషయం మాత్రమేననీ, దీన్ని రాజకీయాలకు అపాదించడం సరికాదని అన్నారు.
KCR: తెలంగాణ సీఎం కేసిఆర్ కీలక ఆదేశాలు .. వారిపై ఆ కేసులు ఎత్తివేయండి