Heat Waves: యాస్ తుఫాను ప్రభావంతో ఏపిలో రెండు రోజుల పాటు వాతావరణం కాస్త చల్లబడినా గురువారం మళ్లీ వేడెక్కింది. వేసవి అధిక ఉష్ణోగ్రతలకు ప్రజలు అల్లాడిపోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు అధికంగా నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయని రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ ప్రకటించింది. ఈ నాలుగు రోజులు ప్రజలు అత్యవసరం అయితే తప్ప ఇళ్ల నుండి బయటకు వెళ్లవద్దని సూచించింది. పగటి ఉష్ణోగ్రతలు 42 నుండి 44 సె వరకూ నమోదు అవుతాయని తెలిపింది. ఎండలు, వడగాల్పుల తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. కావున ప్రజలు జాగ్రత్తలు పాటించాలని ప్రభుత్వం సూచిస్తుంది.
శుక్రవారం నాడు శ్రీకాకుళం, విజయనగరం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో 45 నుండి 46 డిగ్రీలు, విశాఖపట్నం, ప్రకాశం, నెల్లూరు జిల్లాలోని ప్రాంతాల్లో 42 నుండి 44 డిగ్రీలు, చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో 39 నుండి 41 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందని తెలిపింది. అదే విధంగా శనివారం శ్రీకాకుళం, విజయనగరం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 45 నుండి 45 డిగ్రీలు, విశాఖపట్నం, ప్రకాశం, నెల్లూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో 42 నుండి 33 డిగ్రీలు, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో 39 నుండి 41 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందని తెలిపారు.
ఆదివారం కూడా ఇదే మారిదిగా ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశాలు ఉన్నట్లు ఐఎండీ తెలియజేసింది. ఒక వేళ అత్యవసర పనులపై బయటకు వెళ్లాలంటే తగిన జాగ్రతలు తీసుకోవాలని సూచించింది. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో కర్ఫ్యూ కారణంగా ప్రజలు బయటకు వెళ్లడం లేదు. కాకపోతే ఎండ తీవ్రత అధికంగా ఉండటం వల్ల ఇళ్లల్లో విద్యుత్ సమస్య ఏర్పడిన సమయంలో ఉక్కపోతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పిల్లలు, వృద్ధులు వేసవి తాపానికి అల్లాడిపోతున్నారు.