రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం (రేపు) రైతుభరోసా, నివర్ తుఫాను నష్టపరిహారం పంపిణీ చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్ర వైఎస్ జగన్మోహనరెడ్డి రైతుల ఖాతాల్లో నగదును జమ చేయనున్నారు. మూడో విడత రైతు భరోసా కింద 51.59 లక్షల మంది రైతులకు రూ.1,120 కోట్లు చెల్లింపులు చేయనున్నారు. నివర్ తుఫాను కారణంగా 12.01 లక్షల ఎకరాల్లో పంటలు నష్టపోయిన రైతాంగానికి 646 కోట్ల రూపాయల పరిహారాన్ని రైతుల ఖాతాలో జమ చేయనున్నారు. వీటికి తోడు అమ్మఒడి పథకం నిధుల పంపిణీకి ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
2021 జనవరి 9వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న అమ్మఒడి పథకం అమలుకు నేడు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జనవరి 9 తేదీన అమ్మ ఒడి పథకం ద్వారా ఒకటవ తరగతి నుండి 12 తరగతి వరకూ చదివే విద్యార్థుల తల్లులకు రూ.15 వేల వంతున ప్రభుత్వం అందించనున్నది. అయితే ఈ 15 వేలలో మరుగుదొడ్ల నిర్వహణ నిధి (టాయిలెట్స్ మెయింటనెన్స్ ఫండ్, టీఎంఎఫ్) కింద రూ.1000లు మినహాయిస్తారు.
కాగా రాష్ట్రంలో ఒకటవ తరగతి నుండి పదవ తరగతి వరకూ 72,74,674 మంది, 11,12 తరగతులకు సంబంధించి 10,97,580 విద్యార్థులు అమ్మఒడి పథకానికి ఎంపికైయ్యారని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. 61,317 పాఠశాలలు, 3,116 కళాశాలలకు చెందిన మొత్తం 83,72,254 మంది విద్యార్థులకు అమ్మఒడి లబ్ది చేకూరుతుందని ఆయన చెప్పారు. జనవరి 9వ తేదీన సీఎం జగన్ చేతుల మీదుగా విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాలో అమ్మఒడి నగదు జమ చేయనున్నారు. గత ఏడాది కంటే లబ్దిపొందే విద్యార్థుల సంఖ్య పెరిగినట్లు మంత్రి తెలిపారు.