YS Jagan : ఏపీ ముఖ్యమంత్రి , వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి , తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి కొత్త చర్చ జరుగుతోంది. తెలంగాణ సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ ఏపీ సీఎం జగన్ సోదరి వైఎస్ షర్మిల రాజకీయ పార్టీ పెట్టేయడం, తెలంగాణ ప్రభుత్వం నిర్ణయాలను తప్పుపట్టడం తెలిసిన సంగతే. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ పై కూడా కేసీఆర్ కొత్త ఆపరేషన్ చేస్తున్నారా? తన మిత్రపక్ష నేత అయిన ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వైసీపీపై ఉసిగొల్పారా? అనే టాక్ ఇప్పుడు రాజకీయ విశ్లేషకుల నుంచి వినిపిస్తోంది.
అసదుద్దీన్ ఏమంటున్నారంటే….
పురపాలక ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్నూలు జిల్లా ఆదోనిలో ప్రచారం నిర్వహించిన హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వైసీపీ ఎమ్మెల్యే మీద ఘాటు కామెంట్స్ చేశారు. ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిని బేకార్ అంటు అసదుద్దీన్ ఒవైసీ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి బేకార్ వ్యక్తికి మంత్రి పదవి ఇస్తాడంట ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని సంలచన కామెంట్లు చేశారు. నన్ను రానివ్వకుండా ఆపడం ఎవరి తరం కాదు అంటూ సవాల్ విసిరారు.
జగన్ కు డైరెక్ట్ టార్గెట్ ….
కేవలం ఎమ్మెల్యేను మాత్రమే కాకుండా ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని సైతం అసదుద్దీన్ ఓవైసీ టార్గెట్ చేశారు. మైనార్టీ ఓట్లతో ముఖ్యమంత్రులు అయ్యారు మాకు ఆంక్షలు పెడుతున్నారా అని ప్రశ్నించారు. ఇలా కొనసాగితే అన్ని స్థానాల్లో మేము పోటీ చేసి గెలుస్తాం అని అన్నారు. తన సమావేశానికి సీఎం జగన్ అనుమతి ఇవ్వలేదని ఓవైసీ పేర్కొన్నారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుకు ఎలా అనుమతి ఇచ్చారని ప్రశ్నించారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను సీఎం జగన్రెడ్డి గాలికి వదిలేశారని అసదుద్దీన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, అసదుద్దీన్ ఓవైసీ టార్గెట్ చేయడం వెనుక వేరే లెక్కలు ఉన్నాయని అంటున్నారు.