BJP : ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంత ఓపికవంతులు? వారి సహనాన్ని పరీక్షించే ప్రయత్నం చేద్దామా అన్నట్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రయత్నాలు ఉన్నాయని బీజేపీ అంటే గిట్టని వారు విరుచుకుపడుతున్నారు. దాదాపు నెలన్నరగా జరుగుతున్న కీలక అంశంపై కేంద్రం స్పందన నేపథ్యంలో ఈ టాక్ తెరమీదకు వచ్చింది. విశాఖ ఉక్కు ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ.. బీజేపీ మినహా మిగతా పార్టీలు అన్నీ ఆందోళనలో పాల్గొంటున్న విషయం తెలిపిందే. అయితే, తమ వైఖరి ఇదేనని కేంద్ర మరోమారు తేల్చిచెప్పేసింది.
కేంద్రం ఏమంటోంది?
విశాఖ ఉక్కు ప్లాంట్ ప్రైవేటీకరణ వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ ప్రశ్నకు సమాధానం ఇస్తూ కేంద్ర ఉక్కుశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖ ఉక్కు ప్లాంట్ వంద శాతం ప్రైవేటీకరణకు కేబినెట్ నిర్ణయం తీసుకుదని కుండబద్దలు కొట్టిన ఆయన.. స్టీల్ ప్లాంట్తో పాటు అనుబంధ సంస్థలను కూడా కలిపి ప్రైవేటీకరణ చేస్తామన్నారు. తద్వారా తమ ప్రభుత్వం వైఖరిని మళ్లీ స్పష్టం చేశారు. రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలు కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన తీవ్రరూపం చేస్తున్నప్పటికీ విశాఖ స్టీల్ ప్లాంట్పై కేంద్రం తన వైఖరికి కట్టుబడి ఉండటం చర్చనీయాంశంగా మారింది.
జగన్ ఏం చేస్తున్నాడో తెలుసుకోండి
విశాఖ ఉక్కు ప్లాంట్ కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ఈ సందర్భంగా కేంద్ర ఉక్కుశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వివరించారు. ఒడిశా, చత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రభుత్వాలను ఇనుప ఖనిజం గనులను కేటాయించాల్సిందిగా విశాఖ స్టీల్ ప్లాంట్ కోరిందని తెలిపారు. అలాగే, కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖను కూడా విశాఖ స్టీల్ విజ్ఞప్తి చేసిందన్నారు. ఒడిశా ప్రభుత్వాన్ని ఓ ప్రత్యేక బ్లాక్ ను కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా విజ్ఞప్తి చేసిందని కేంద్ర మంత్రి తెలిపారు.