బీజేపీ అగ్రనేత, కేంద్ర మంత్రి అమిత్ షా నిన్న మునుగోడు బహిరంగ సభలో పాల్గొనేందుకు తెలంగాణకు వచ్చిన సందర్భంలో రాత్రి ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ తో భేటీ అయిన సంగతి తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్ తో అమిత్ షా భేటీ కావడం తెలుగు రాష్ట్రాల రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది. దీనిపై రకరకాల ఊహాగానాలు సాగుతున్నాయి. ఎవరికి తోచినట్లుగా వారు ఊహించుకుంటున్నారు. మీడియాల్లో విశ్లేషణలు జరుగుతున్నాయి. దీనిపై జూనియర్ ఎన్టీఆర్ కుటుంబానికి సన్నిహితుడైన ఏపి మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని స్పందించారు.
గుడివాడలో నాని మీడియాతో మాట్లాడుతూ కేవలం రాజకీయ వ్యూహంతోనే జూనియర్ ఎన్టీఆర్ తో అమిత్ షా భేటీ అయి ఉంటారని అభిప్రాయపడ్డారు. తెలుగు రాష్ట్రాల్లో తమ పార్టీ (బీజేపీ)ని విస్తరించుకోవడానికి మోడీ, అమిత్ షా ధ్వయం ఏన్నో వ్యూహాలతో ముందుకు వెళుతోందని, దానిలో భాగంగానే ఈ సమావేశం జరిగి ఉంటుందన్నారు నాని. ఆర్ ఆర్ ఆర్ మువీతో పాన్ ఇండియా స్టార్ గా ఎన్టీఆర్ స్థాయి పెరిగినందున, తెలుగు రాష్ట్రాలకే కాకుండా దేశ వ్యాప్తంగా ఆయన సేవలను వినియోగించుకోవాలని బీజేపీ భావిస్తుండవచ్చని అభిప్రాయపడ్డారు. సినిమాలు బాగున్నాయని అభినందించడానికే ఈ భేటీ అంటే తనకు నమ్మకం లేదనీ, ఈ భేటీకి రాజకీయ కారణాలు తప్పక ఉంటాయన్నారు. బీజేపీకి ఉపయోగం కలగకపోతే మోడీ, అమిత్ షా ఒక్క నిమిషం కూడా ఎవరికి సమయం కేటాయించరని ఆయన అన్నారు.
శంషాబాద్ సమీపంలోని నోవాటెల్ హోటల్ నందు ఆదివారం రాత్రి 45 నిమిషాలు ఉన్న అమిత్ షా .. 20 నిమిషాల పాటు ఏకాంతంగా ఎన్టీఆర్ తో సమావేశమైయ్యారు. తరువాత ఆయనతో కలిసి భోజనం చేశారు అమిత్ షా. జూనియర్ ఎన్టీఆర్ కు ఇంతటి ప్రాధాన్యత ఇవ్వడంపై సర్వత్రా ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.