Kondapalli municipality: కృష్ణాజిల్లా కొండపల్లి మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికను అధికారులు వాయిదా వేయడంతో ఎక్స్ అఫిషియో సభ్యుడు హోదాలో హజరైన టీడీపీ ఎంపీ కేశినేని నాని నిరసన వ్యక్తం చేశారు. కొండపల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో టీడీపీ, వైసీపీకి 14-14 సమానంగా కౌన్సిలర్ స్థానాలు రావడం, గెలిచిన ఒక్క ఇండిపెండెంట్ అభ్యర్ధిని టీడీపీ వైపుకు వెళ్లడంతో చైర్మన్ ఎన్నిక ఉత్కంఠతను రేపుతోంది. ఇక్కడ ఎక్స్ అఫిషియో సభ్యుడుగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు టీడీపీ విజయవాడ ఎంపి కేశినేని నాని కొండపల్లి మున్సిపల్ కమిషనర్ కు లేఖ రాయగా దానిపై స్పందించలేదు దీంతో కేశినేని హైకోర్టును ఆశ్రయించడంతో కేశినేని నాని ఓటు హక్కుకు అనుమతి ఇస్తూ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ఫలితాన్ని ప్రకటించవద్దని ఆదేశించింది. ఈ నెల 17వ తేదీ ఓట్ల లెక్కింపు పూర్తి అయినప్పటి నుండి టీడీపీ, వైసీపీ అభ్యర్ధులను ఆయా పార్టీలు క్యాంప్ కు తరలించాయి.
కేశినేని నానికి వ్యతిరేకంగా వైసీపీ సభ్యుల గొడవ
సోమవారం చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో కేశినేని నాని, 15 మంది కౌన్సిలర్ లతో మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సమయంలో కేశినేని నాని ఓటు హక్కు వినియోగించుకోవడాన్ని వ్యతిరేకంగా వైసీపీ శ్రేణులు నినాదాలు చేశారు. వైసీపీ సభ్యులు గొడవ చేయడంతో డిప్యూటి కలెక్టర్ చైర్మన్ ఎన్నికను రేపటికి వాయిదా వేశారు. కౌన్సిల్ హాలు బయట టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. ఎక్స్ అఫిషియో సభ్యుడుగా వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మున్సిపల్ కార్యాలయానికి చేరుకుని ఎన్నిక వాయిదా వేయడంతో కౌన్సిల్ హాలు నుండి బయటకు వెళ్లిపోయారు.
Kondapalli municipality: కౌన్సిల్ హాలులో ఎంపి కేశినేని నాని నిరసన
ఎన్నిక వాయిదా వేయడం న్యాయ నిబంధన ఉల్లంఘనే అని టీడీపీ విమర్శిస్తోంది. కోరం ఉన్నా ఎన్నిక జరపకుండా వాయిదా వేయడంపై కేశినేని సహా టీడీపీ సభ్యులు కౌన్సిల్ హాలులో భైటాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ కార్యాలయం వద్దకు పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు. కేశినేని నాని ని అరెస్టు చేసి విజయవాడ తరలించే ఆలోచన చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.