KCR తెలంగాణ సీఎం కేసీఆర్ విషయంలో గత కొద్దికాలంగా హాట్ టాపిక్ చర్చ జరుగుతోంది. టీఆర్ఎస్-బీజేపీ ఒప్పందం కుదుర్చుకున్నాయని , తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ మేరకు అంగీకారం చేసుకున్నారని విపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి.
అయితే, ఈ విషయంలో తాజాగా తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మోడీ – కేసీఆర్ మధ్య దోస్తీ ఉందనే కేసులు బయటికి రావడం లేదని రేవంత్ రెడ్డి ఆరోపించారు.
KCR తమిళనాడు లో కొత్త గేమ్ ?
గ్రేటర్ ఎన్నికల తర్వాత ఢిల్లీ వెళ్లిన సీఎం కేసీఆర్ ప్రధాని మోడీ ముందు మోకారిల్లారని ఆరోపించారు. కేసులు చూపెట్టి కేసీఆర్ ను భయపెట్టి మోడీ లొంగదీసుకున్నారని విరుచుకుపడ్డారు. త్వరలోనే తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డిని తమిళనాడు బీజేపీ ఎన్నికల ఇంచార్జ్గా ఆ పార్టీ అధిష్టానం నియమించింది. ఈ నియామకంపై రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. టీఆర్ఎస్ సహకారం తమిళనాడుకు చేరేందుకు కిషన్ రెడ్డిని ఎన్నికల బాధ్యుడిగా నియమించారని.. దీంతో.. టీఆర్ఎస్-బీజేపీ మధ్య ఒప్పందం బహిరంగంగానే బయటపెడుతున్నారని పేర్కొన్నారు. తెలంగాణ నుంచి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు నిధులు సమకూర్చనున్నారని ఆరోపించారు. తెలంగాణ ఇంటిలిజెన్స్ అధికారులను తమిళనాడులో పెట్టి బీజేపీకి కేసీఆర్ సహకారం అందిస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు రేవంత్ రెడ్డి.. తెలంగాణ నిఘా అధికారులను తమిళనాడులో పెట్టారన్న అంశంపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
వాళ్లంతా ఆటలో అరటిపండు అంటూ…
తెలంగాణ సీఎం కేసీఆర్ గత ఢిల్లీ పర్యటన సందర్భంగా బీజేపీకి సహకరిస్తానాని ప్రధాని మోడీతో ఒప్పందం కుదుర్చుకున్నారని కేసీఆర్ తీరుతో తెలంగాణకు సంపూర్ణ అన్యాయం జరుగుతోందని మండిపడ్డారు. తెలంగాణ బీజేపీ నేతలు బండి సంజయ్, అరవింద్ ఆటలో అరటిపండు లాంటివారంటూ సెటైర్లు వేసిన రేవంత్ రెడ్డి.. సీఎం కేసీఆర్ను జైలుకు పంపుతామన్న బండి సంజయ్ ఒక్క కేసు కూడా ఎందుకు నమోదు చేయించలేకపోయారు? అని ప్రశ్నించారు.